news18-telugu
Updated: January 13, 2021, 10:49 PM IST
Kohli-Imran Khan
ఇటీవల ప్రకటించిన ఐసీసీ డెకేడ్ టీమ్స్ లో ఒక పాకిస్థాన్ క్రికెటర్ కూడా చోటు దక్కలేదు. దీంతో ఆ దేశ క్రికెట్ ఫ్యాన్స్ అసంతృప్తితో ఉన్నారు. అయితే ఐసీసీ నిర్వహించిన ఓ పోల్ మాత్రం వారిని తెగ ఖుషీ చేస్తోంది. ఆ పోల్ లో ఏకంగా విరాట్ కోహ్లీనే వెనక్కి నెట్టి.. పాక్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ మొదటి స్థానంలో నిలిచారు. కెప్టెన్లు అయిన తర్వాత తమ వ్యక్తిగత సామర్థ్యాన్ని మెరుగుపర్చుకున్న ఆటగాళ్లు ఎవరంటూ ఐసీసీ ఇటీవల ట్విటర్లో ఓటింగ్ నిర్వహించింది. కోహ్లీ, ఇమ్రాన్, ఏబీ డివిలియర్స్, మెగ్ లాన్నింగ్లలో ఎవరిని ఎన్నుకుంటారంటూ నిర్వహించిన ఈ పోలింగ్లో మొత్తం 536,346 ఓట్లు నమోదయ్యాయి. ఈ సందర్భంగా ఇమ్రాన్, కోహ్లీ మధ్య హోరాహోరీ పోరు నడిచింది. ఇమ్రాన్కు 47.3 శాతం ఓట్లు రాగా... కోహ్లీకి 46.2 శాతం ఓట్లు వచ్చాయి. సౌతాఫ్రికా దిగ్గజం డివిలియర్స్ 6 శాతం ఓట్లతో సరిపెట్టుకోగా.. ఆస్ట్రేలియా ప్రముఖ క్రికెటర్ లాన్నింగ్ కేవలం 0.5 శాతం ఓట్లు వచ్చాయి. కెప్టెన్సీ అనేది ఎవరికి వరంగా మారింది.. దాని ఫలితంగా ఎవరి సరాసరి పెరిగింది అనే అంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ నలుగురినీ ఎంపిక చేశారు.
విరాట్ కోహ్లీ టీమిండియా కెప్టెన్ కాకముందు కేవలం 51.29 సగటుతో ఉండగా.. కెప్టెన్ అయిన తర్వాత ఇది ఏకంగా 73.88కి పెరిగింది. ఇక పాకిస్తాన్కు 1992లో ప్రపంచ కప్ తెచ్చిపెట్టిన ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్ కాకముందు బ్యాటింగ్లో 25.43 సగటుతోనూ, బౌలింగ్లో 25.53 సగటుతోనూ ఉన్నాడు. అయితే కెప్టెన్ అయిన తర్వాత బ్యాటింగ్ యావరేజ్ 52.34కి పెరగ్గా.. బౌలింగ్లో కూడా అతడి యావరేజ్ 20 శాతం పెరిగింది. ఇలా ఐసీసీ ట్విట్టర్ పోల్ లో తమ దేశ క్రికెటర్ మొదటి స్థానంలో నిలవడంతో పాకిస్థాన్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.
Published by:
Sridhar Reddy
First published:
January 13, 2021, 10:49 PM IST