ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానుల్ని ఉర్రూతలూగించే విధంగా ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup 2022) ప్రారంభం అయింది. ఇక, ఆరంభం మ్యాచులో ఈక్వెడార్ 2-0 తేడాతో ఆతిథ్య ఖతార్ ను ఓడించి.. టోర్నీని ఘనంగా ప్రారంభించింది. ఇక, రెండో రోజు జరిగిన మ్యాచులో ఇరాన్ పై ఇంగ్లండ్ (England vs Iran) 6-2తో గెలిచారు. ఈ మ్యాచులో ఇరాన్ జట్టు ఓడినప్పటికీ.. ఆ టీం ఆటగాళ్లు చేసిన పని ఇప్పుడు వైరలవుతుంది. ఈ మ్యాచ్ ఆట ఆరంభానికి ముందు ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సంప్రదాయం ప్రకారం మ్యాచ్ ఆరంభానికి ముందు ఇరు జట్లు తమ జాతీయ గీతాన్ని ఆలపించాల్సి ఉంటుంది. ఇంగ్లండ్ తమ జాతీయ గీతాన్ని పాడగా.. ఇరాన్ జట్టు మాత్రం జాతీయ గీతం పాడకుండా నిరసన తెలియజేసింది.
ఇలా చేయడంతో సంప్రదాయం పేరిట మహిళల హక్కులను కాలరాస్తున్న ఇరాన్ ప్రభుత్వానికి ఖతార్ వేదికగా ఫిఫా వర్డల్ కప్లో భారీ షాక్ తగిలింది. ప్రారంభకార్యక్రమంలో ఇరాన్ జట్టు సభ్యులందరూ జాతీయ గీతాలాపనకు బదులు మౌనం దాల్చారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జాతీయ గీతం ఆలపించాలా వద్దా అనేది జట్టు సభ్యులు అందరూ ఉమ్మడిగా నిర్ణయిస్తారని జట్టు కెప్టెన్ అలీరెజా జహాన్ బక్ష అంతకుముందు పేర్కొన్నారు.
ఈ క్రమంలో.. ఇరాన్ జట్టు చివరకు జాతీయ గీతం ఆలపించలేదని అంతర్జాతీయ మీడియాలో విస్తృత కథనాలు వెలువడ్డాయి. దీంతో.. స్టేడియంలోని ఇరాన్ మహిళా అభిమానులు కన్నీళ్లు పెట్టుకున్న ఫోటోలు. దీంతో.. ఈ ఫోటోలపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. మ్యాచ్ ఓడినా.. మనసులు గెలుచుకున్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.
తమ హక్కుల కోసం ఇరాన్ మహిళలు గత రెండు నెలలుగా దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్న విషయం తెలిసిందే. హిజాబ్ ధరించని కారణంగా జైలు పాలైన మాసా అమీనీ పోలీసు కస్టడీలోనే మృతి చెందడంతో ఇరాన్లో ఒక్కసారిగా అగ్గిరాజుకుంది. తొలుత చిన్నపాటి నిరసనల కార్యక్రమాలుగా మొదలైన మహిళల ఆగ్రహ జ్వాల చూస్తుండగానే.. యావత్ దేశాన్ని చుట్టుముట్టింది వేల సంఖ్యలో యువతులు, మహిళలు వీధుల్లో కదనుతొక్కుతూ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. సంప్రదాయం పేరిట తిరోగమన విధానాలను ప్రోత్సహిస్తూ తమ హక్కులను ఉల్లంఘిస్తున్నారని వనితలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఆందోళనకారులకు మద్దతుగా, ఇరాన్ ప్రభుత్వ తీరుకి వ్యతిరేకంగా ఆ దేశ ఆటగాళ్లు ఫిఫా ప్రపంచ కప్ లో ఆడుతున్న తొలి మ్యాచులో జాతీయ గీతాన్ని ఆలపించలేదు. ఆట జరుగుతున్న ఖలీఫా అంతర్జాతీయ మైదానంలో ఇరాన్ జాతీయ గీతాన్ని ప్లే చేసిన సమయంలో ఆ దేశానికి చెందిన 11 మంది ఆటగాళ్లూ మౌనంగా ఉండిపోయారు. తమ జట్టు సభ్యులం అందరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నామని ఇరాన్ కెప్టెన్ అలీ రెజా జహంబఖష్ చెప్పాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: England, FIFA, FIFA World Cup 2022, Foot ball, Iran