టీ20 ప్రపంచకప్ (T20 World cup) సూపర్ 12 మ్యాచ్లో వెస్టిండీస్ (West indies)పై ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. వెస్టిండీస్ నిర్దేశించిన 56 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ (England) జట్టు కేవలం 8.2 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి చేధించింది. ఇంగ్లాండ్ బ్యాట్స్మన్ జోస్ బట్లర్ 22 బంతుల్లో 24 పరుగులతో ( 4 ఫోర్లు) నాటౌట్గా నిలిచాడు. మిగిలిన బ్యాట్స్మన్ తక్కువ స్కోర్లకే వెనుదిరిగినా లక్ష్యం స్వల్పమే కావడంతో ఇంగ్లాండ్కు పెద్దగా కష్టపడలేదు. కాగా, అంతకుముందు టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఇన్నింగ్స్ రెండో ఓవర్ నుంచే వెస్టిండీస్ వికెట్ల పతనం ప్రారంభం అయింది. ఎవరూ ఊహించని విధంగా కేవలం 55 పరుగులకే కరీబియన్ జట్టు కుప్పకూలింది. ఆ జట్టు కేవలం 14.2 ఓవర్లలో ఆలౌట్ అయింది.
తడబడుతూ...
బ్యాటింగ్కు దిగిన వెస్టిండిస్ జట్టులో ఓపెనర్ ఎవిన్ లూయిస్ సిక్సర్ కొట్టి ఊపు మీద కనిపించాడు. అయితే ఎవిన్ను క్రిస్ వోక్స్ అవుట్ చేసి ఇంగ్లండ్ మొదటి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత మూడో ఓవర్లో లెండిల్ సిమ్మన్స్, ఐదో ఓవర్లో షిమ్రన్ హెట్మేయర్, ఆరో ఓవర్లో క్రిస్ గేల్ కూడా అవుట్ కావడంతో పవర్ ప్లే ముగిసే సరికి వెస్టిండీస్ నాలుగు వికెట్లు కోల్పోయి 31 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత కూడా వికెట్ల పతనం అస్సలు ఆగలేదు. ఎనిమిదో ఓవర్లో డ్వేన్ బ్రేవోను క్రిస్ జోర్డాన్ అవుట్ చేయగా.. తొమ్మిదో ఓవర్లో నికోలస్ పూరన్ను టైమల్ మిల్స్ పెవిలియన్ దారి పట్టించాడు. 10 ఓవర్లలో వెస్టిండీస్ ఆరు వికెట్లు నష్టపోయి 44 పరుగులు మాత్రమే చేసింది.
వచ్చిందే వెళ్లడానికి అన్నట్లు..
10 ఓవర్ల తర్వాత వెస్టిండీస్ ఇన్నింగ్స్ (West Indies) ముగిసిపోవడానికి ఎంతో సేపు పట్టలేదు. చివరి నాలుగు వికెట్లను ఆదిల్ రషీద్ తీశాడు. తన మొదటి ఓవర్లోనే రసెల్ను అవుట్ చేసిన రషీద్ , 2వ ఓవర్లో వరుస బంతుల్లో కీరన్ పొలార్డ్, ఓబెడ్ మెక్కాయ్ని, 3వ ఓవర్లో రవి రాంపాల్ని అవుట్ చేయడంతో వెస్టిండీస్ ఇన్నింగ్స్ ముగిసింది. 14.2 ఓవర్లలో 55 పరుగులకే వెస్టిండీస్ కుప్పకూలింది. క్రిస్ గేల్ తప్ప వెస్టిండీస్ ఇన్నింగ్స్లో ఎవరూ రెండంకెల స్కోరు చేయలేదు. ఇన్నింగ్స్ మొత్తమ్మీద ఆరు ఫోర్లు, ఒక సిక్సర్ మాత్రమే వచ్చాయి. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ 4 వికెట్లు తీయగా, మొయిన్ అలీ, టైమల్ మిల్స్ రెండేసి వికెట్లు తీశారు. క్రిస్ గేల్, జోర్డాన్లకు చెరో వికెట్ దక్కింది.
జాగ్రత్తగా విజయతీరాలకు..
అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇంగ్లాండ్ జట్టు కేవలం 8.2 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి 55 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో జేసన్ రాయ్(11), ఐదో ఓవర్లో జానీ బెయిర్ స్టో(9), ఆరో ఓవర్లో మొయిన్ అలీ(3), ఏడో ఓవర్లో లియామ్ లివింగ్ స్టోన్ (1) తొందరగానే అవుటయ్యారు. జోస్ బట్లర్ (24 నాటౌట్: 22 బంతుల్లో, మూడు ఫోర్లు) జాగ్రత్తగా ఆడటంతో ఇంగ్లండ్ 8.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. విండీస్ బౌలర్లలో అకియల్ హుస్సేన్ రెండు వికెట్లు తీశాడు. రవి రాంపాల్కు ఒక వికెట్ దక్కింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, England, Icc world cut, T20 World Cup 2021, UAE, West Indies