టీమ్ ఇండియా (Team India) ప్రధాన కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) సహా సహాయక సిబ్బంది కోవిడ్-19 పాజిటివ్గా నిర్దారించబడిన ఘటన ఇప్పుడు ఇరు క్రికెట్ బోర్డుల మధ్య వివాదంగా మారింది. మాంచెస్టర్ వేదికగా జరుగనున్న ఐదో టెస్టును రద్దు చేయాలని బీసీసీఐ (BCCI) కోరగా.. ఆ టెస్టును వాకోవర్ ఇస్తే సిరీస్ ముగిద్దామని ఈసీబీ (ECB) మెలికపెట్టింది. వాకోవర్ ఇవ్వడం వల్ల.. ఇప్పడు 2-1తో ఉన్న సిరీస్ కాస్తా 2-2గా మారి సమం అవుతుంది. కాగా, ఈ విషయంపై కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) సహా రోహిత్ శర్మ (Rohit Sharma) కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీబీ చేసిన ప్రతిపాదన తమకు సమ్మతంగా లేదని తేల్చి చెప్పారు. గురువారం రాత్రి టీమ్ ఇండియా క్రికెటర్లు అందరికీ చేసిన కోవిడ్ టెస్టు ఫలితాలు నెగెటివ్గా వచ్చాయి. దీంతో అందరినీ మాంచెస్టర్లోని రాడిసన్ హోటల్కు పరిమితం చేశారు. క్రికెటర్లు అందరినీ బయోబబుల్లోనే ఉంచారు.
ఐదో టెస్టు షెడ్యూల్ ప్రకారమే ఆడటామని బీసీసీఐ కూడా తేల్చి చెప్పడంతో ఈసీబీ వెనక్కు తగ్గింది. టీమ్ ఇండియా క్రికెటర్లు కనీసం గ్రౌండ్లో కూడా కాలు పెట్టకుండానే ఐదో టెస్టును తమ ఖాతాలో వేసుకుందామని అనుకున్న ఈసీబీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈసీబీ-బీసీసీఐ అధికారుల మధ్య జరిగిన సమావేశం చాలా ఆసక్తికరంగా ముగిసింది. కోవిడ్ నేపథ్యంలో ఐదో టెస్టును రద్దు చేయాలని.. దీని వల్ల ఐపీఎల్ 2021 రెండో దశకు కూడా ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉందని బీసీసీఐ అధికారులు తెలిపారు. ద్వైపాక్షిక సిరీస్ కంటే ఐపీఎల్కు ప్రాధాన్యత ఇవ్వడంపై ఈసీబీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదో టెస్టు రద్దు చేయడం వల్ల బ్రాడ్కాస్టింగ్, గేట్ ఆదాయం ద్వారా 30 మిలియన్ పౌండ్లు (దాదాపు రూ. 304 కోట్లు) తమకు నష్టం వాటిల్లుతుందని.. బీసీసీఐ దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పింది. ఈసీబీ అధికారుల వ్యాఖ్యలపై బీసీసీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మరోవైపు మ్యాచ్ను వాకోవర్ ఇచ్చే ప్రతిపాదనపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.
Rashid Kahn: అఫ్గాన్ క్రికెట్ బోర్డుపై రషీద్ ఖాన్ ఆగ్రహం.. సంచలన నిర్ణయం తీసుకున్న మిస్టరీ స్పిన్నర్
ఇక బయోబబుల్ దాటి పుస్తక ఆవిష్కరణకు వెళ్లడంపై కూడా ఈసీబీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఈ విషయంపై తాము విచారణ ప్రారంభించామని బీసీసీఐ తెలిపింది. ఈ మొత్తం ఘటన ఇరు బోర్డుల మధ్య విభేదాలకు దారి తీసింది. టీమ్ ఇండియా క్రికెటర్లు అందరూ నెగెటివ్గా తేలడంతో షెడ్యూల్ ప్రకారమే టెస్టు మ్యాచ్ ఆడతామని బీసీసీఐ అధికారులు తేల్చి చెప్పారు. ఇక టీమ్ ఇండియా ఫిజియో నితిన్ పటేల్ పాజిటివ్ తేలడంతో అతని బాధ్యతలు అసిస్టెంట్ ఫిజియో యోగేష్ పర్మార్కు అప్పగించారు. కానీ మరుసటి రోజు పర్మార్ కూడా పాజిటివ్గా నిర్దారించబడ్డాడు. అతడికి సన్నిహితంగా మెలిగిన రోహిత్ శర్మ, చతేశ్వర్ పుజార, రవీంద్ర జడేజా, మహ్మద్ షమి, ఇషాంత్ శర్మ మాత్రం నెగెటివ్ రావడంతో బీసీసీఐ ఊపిరి పీల్చుకున్నది. ప్రస్తుతం వీళ్లందరూ రాడిసన్ హోటల్లో ప్రత్యేక ఫ్లోర్లో బయోబబుల్లో ఉన్నారు. టెస్టు ముగిసే వరకు అక్కడే ఉండి.. ఆ తర్వాత ప్రత్యేక విమానంలో ఐపీఎల్ 2021 రెండో దశ కోసం నేరుగా యూఏఈ వెళ్లనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bcci, India vs england, Test Cricket, Virat kohli