ప్రపంచకప్ ముగిసింది.. ఇంగ్లండ్ విశ్వవిజేతగా నిలిచింది.. ఇన్నాళ్లూ అందని ద్రాక్షగా మిగిలిన వరల్డ్ కప్ తొలిసారి పుట్టింటికి చేరింది.. అయితే, ఈ వరల్డ్ కప్ కొందరికి సంతోషాన్ని పంచగా, కొందరికి విషాదం మిగిల్చింది. కొందరు హీరోలుగా మిగలగా, కొందరు జీరోలయ్యారు. ఈ వరల్డ్ కప్ మొదలైనప్పటి నుంచి తుది ఫలితం వెలువడే వరకు అన్ని సందర్భాల్లో వివాదమే. కొన్ని మ్యాచ్లను వర్షం మింగేస్తే, కొన్ని మ్యాచ్లు రసవత్తరంగా, ఇంకొన్ని మ్యాచ్లు పస లేకుండా ముగిశాయి. అన్నింటికంటే.. అత్యంత వివాదాస్పదమైన క్రికెట్ వరల్డ్ కప్ ఏదైనా ఉందంటే అది.. 2019 వరల్డ్ కప్ అని చెప్పుకోవాలి. తొలుత వర్షం.. ఆ తర్వాత అంపైర్ల పేలవ నిర్ణయాలు.. చివరికి ఫైనల్ ఫలితం. వివాదాలతోనే ముగిసింది ఈ ప్రపంచకప్ సమరం.
ఇక, ఈ వరల్డ్ కప్లో హీరోలుగా నిలిచిన వారితో ఐసీసీ ఒక జట్టును తయారు చేసింది. దేశంతో సంబంధం లేకుండా తయారు చేసిన ఈ జట్టులో భారత్ నుంచి ఇద్దరికి చోటు లభించింది. అందులో రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా ఉన్నారు. విశేషమేమిటంటే.. ఈ వరల్డ్ కప్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి, మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనికి చోటు దక్కలేదు.
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఐసీసీ జట్టు కెప్టెన్గా ఎంపికయ్యాడు. వికెట్ కీపర్గా అలెక్స్ క్యారీ ఎంపికవగా, 12వ ఆటగాడిగా న్యూజిలాండ్కు చెందిన బౌలర్ ట్రెంట్ బౌల్ట్ ఉన్నాడు. ఇదిలా ఉండగా, ఇంగ్లండ్ నుంచి నలుగురు ఆటగాళ్లు ఎంపికవడం విశేషం. ఆస్ట్రేలియా నుంచి ఇద్దరు, న్యూజిలాండ్ నుంచి ముగ్గురు, బంగ్లాదేశ్ నుంచి షకీబ్ అల్ హసన్ ఉన్నారు. ఇక, కోహ్లీ జట్టులో లేకపోవడంపై అభిమానులు ఐసీసీపై గరంగరం అవుతున్నారు.
ఐసీసీ అత్యుత్తమ జట్టు ఇదే..
రోహిత్ శర్మ (ఇండియా)
జాసన్ రాయ్ (ఇంగ్లండ్)
కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్)- కెప్టెన్
షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్)
జో రూట్ (ఇంగ్లండ్)
బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్)
అలెక్స్ క్యారీ (ఆస్ట్రేలియా)- వికెట్ కీపర్
మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా)
జోఫ్రా ఆర్చర్ (ఇంగ్లండ్)
లాకీ ఫెర్గుసన్ (న్యూజిలాండ్)
జస్ప్రిత్ బుమ్రా (ఇండియా)
ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్)- 12వ ఆటగాడు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, Cricket World Cup 2019, ICC, ICC Cricket World Cup 2019, Ms dhoni, Virat kohli, World Cup 2019