మానవాళి నుదుటి మీద కరోనా (Corona) రాస్తున్న మృత్యు శాసనానికి ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడేలా లేదు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి ప్రభావం చూపుతోంది. రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది. ఇప్పుడు ఈ మహమ్మారి కన్ను క్రీడా రంగంపై పడింది. ఇప్పటికే రంజీ ట్రోఫీపై కన్నేసిన కరోనా.. యాషెస్ సిరీస్ లోనూ కలకలం సృష్టిస్తోంది.ఇప్పటికే ఇంగ్లండ్ జట్టుకు చెందిన ఎనిమిది మందితోపాటు ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ నిక్ హాక్లీకి కూడా కరోనా పాజిటివ్గా తేలింది. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా సైతం ధృవీకరించింది.బుధవారం నుంచి ప్రారంభం కానున్న సిడ్నీ టెస్టుకు ముందు నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నిక్ హాక్లీకి పాజిట్గా నిర్ధారణ అయింది. హాక్లీ కరోనాకు చెందిన టీకాలన్నింటిని తీసుకున్న కూడా వైరస్ బారిన పడ్డారు.
ప్రస్తుతం ఆయనకు తేలికపాటి లక్షణాలు ఉన్నాయి. ప్రస్తుతం న్యూ సౌత్ వేల్స్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం హాక్లీ క్వారంటైన్లో ఉంటున్నారు. అయితే ఆటగాళ్లను కానీ, ఇతర సభ్యులను కానీ ఆయన ఇటీవల కలవకపోవడం కాస్త ఊరనిచ్చే అంశం. అంతేకాకుండా హాక్లీ కుటుంబసభ్యులందరికీ నెగెటివ్ రిపోర్టులు వచ్చాయి. ఆటగాళ్లకు కూడా తాజాగా ఎవరికీ వైరస్ సోకలేదు.
మెల్బోర్న్ టెస్టు మ్యాచ్ ముగిసిన అనంతరం ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్కు కరోనా సోకిన సంగతి తెలిసిందే. దీంతో హెడ్ ప్రస్తుతం భార్యతో కలిసి క్వారంటైన్లో ఉంటున్నాడు. కరోనా కారణంగా హెడ్ బుధవారం నుంచి సిడ్నీ వేదికగా జరగనున్న నాల్గో టెస్టు మ్యాచ్కు దూరం కానున్నాడు. కాగా ఆస్ట్రేలియాలో జరగుతున్న బిగ్బాష్ లీగ్లో సైతం కరోనా విజృంభిస్తోంది. ఇటీవల ఓ జట్టులోని ఏకంగా 11 మంది సభ్యులకు వైరస్ సోకడంతో మ్యాచ్నే వాయిదా వేశారు.
ఇప్పటికే యాషెస్ సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్ను కరోనా మరింత కలవరపెడుతోంది. మొత్తం ఆ జట్టు సపోర్టింగ్ స్టాఫ్లోని 8 మంది సభ్యులు వైరస్ బారిన పడ్డారు. వైరస్ బారిన పడ్డవారిలో సపోర్టింగ్ స్టాఫ్ కుటుంబసభ్యులు కూడా ఉన్నారు. ఇంగ్లండ్ జట్టు ప్రధాన కోచ్ సిల్వర్ వుడ్ సైతం కరోనా బారినపడ్డారు. దీంతో ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్న వుడ్ బుధవారం నుంచి జరగనున్న నాల్గో టెస్టు మ్యాచ్కు అందుబాటులో ఉండడం లేదు.
ఇది కూడా చదవండి : కోహ్లీ బలమే ఇప్పుడు అతనికి శాపంగా మారిందా..? ఆ తప్పు సరిచేసుకోకపోతే కష్టమేనా..!
ఇటీవల బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సైతం కరోనా బారిన పడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొంది కాస్త కోలుకున్న గంగూలీ.. ప్రస్తుతం హోంక్వారంటైన్లో ఉంటున్నారు. అయితే దాదాకు సోకింది డెల్టా వేరియంట్ అని ఇటీవల వైద్యులు నిర్దారించారు. దీంతో వైద్యులు సమక్షంలో గంగూలీ క్వారంటైన్లో ఉంటున్నారు. ఇక, రంజీ ట్రోఫీకి ముందు బీసీసీఐకి కూడా షాక్ తగిలింది. బెంగాల్ రంజీ టీమ్ లో ఏడుగురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇందులో ఆరుగురు ఆటగాళ్లతో పాటు ఒక సపోర్ట్ స్టాఫ్ ఉన్నారు. అలాగే, ముంబై జట్టు ఆల్ రౌండర్ శివమ్ దూబే, మరో సపోర్టింగ్ స్టాఫ్ కి కూడా వైరస్ నిర్ధారణ అయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ashes, Corona, Cricket, England vs Australia