మూడు రోజుల క్రితం శ్రీలంక టీమ్ బౌలింగ్ కోచ్ గా నియమితుడైన మాజీ దిగ్గజ బౌలర్ చమింద్ వాస్..అప్పుడే గుడ్ బై చెప్పేశాడు. నాటకీయమైన మలుపుల మధ్య వాస్ లంక జట్టు బౌలింగ్ కోచ్ పదవికి సోమవారం రాజీనామా చేశారు. ఈ మధ్య సౌతాఫ్రికా, ఇంగ్లండ్ టూర్లలో టీమ్ ప్రదర్శన మరీ దారుణంగా ఉంటంతో అప్పటి వరకూ బౌలింగ్ కోచ్గా ఉన్న డేవిడ్ సకర్ను తొలగించి గత వారమే ఆ బాధ్యతలు వాస్కు అప్పగించింది లంక బోర్డు. సోమవారం రాత్రి టీమ్తో కలిసి వాస్ వెస్టిండీస్కు వెళ్లాల్సింది. కానీ, శ్రీలంక క్రికెట్ బోర్డుతో వేతనం విషయంలో డీల్ కుదరకపోవడంతో అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. సరిగ్గా శ్రీలంక టీమ్ వెస్టిండీస్ టూర్కు బయలుదేరే ముందే వాస్ రాజీనామా చేయడంపై లంక బోర్డు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందరి ఆర్థిక పరిస్థితులు తలకిందులైన సమయంలో వాస్ ఇలా చేయడం సరికాదని, అది కూడా టీమ్ బయలుదేరే ముందే రాజీనామా చేయడం ఏంటని లంక బోర్డు అధికారి ప్రశ్నించారు.
శ్రీలంక మోస్ట్ సక్సెస్ఫుల్ పేస్బౌలర్ అయిన వాస్.. టెస్టుల్లో 355, వన్డేల్లో 400 వికెట్లు తీశాడు. అలాంటి లెజెండరీ బౌలర్ ఇలా ఉన్నట్లుండి రాజీనామా చేయడంపై లంక బోర్డు ఆవేదన వ్యక్తం చేసింది. అయితే సోమవారం రాత్రి బయలుదేరిన లంక జట్టుకు దేశ క్రీడా మంత్రిత్వ శాఖ అనుమతి లభించలేదు. టీ20 జట్టులో నలుగురు కొత్త ఆటగాళ్లు రమేష్ మెండిస్, దిల్షన్ మదుశంకా, పాతుమ్ నిస్సంకా మరియు అషేన్ బండారా చోటు దక్కించుకున్నారు.
Published by:Sridhar Reddy
First published:February 23, 2021, 13:50 IST