BCCI TO ALLOW PLAYERS REGISTRATIONS UPTO 100 BUT ONLY 250 PLAYERS WILL COME UNDER HAMMER IN IPL 2022 MEGA AUCTION JNK
IPL 2022: మెగా వేలానికి 1000 మంది ఆటగాళ్లు.. కానీ కొనుగోలు చేసేది ఎంత మందినో తెలుసా?
IPL 2022 Mega Auction
IPL 2022: ఐపీఎల్ మెగా ఆక్షన్ ఫిబ్రవరి 12, 13 తేదీల్లో నిర్వహించనున్నారు. బీసీసీఐ ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలకు వేలానికి సంబంధించిన సమాచారాన్ని పంపించింది. మెగా వేలం కోసం 1000 మంది ఆటగాళ్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నా.. కేవలం 250 మందికి మాత్రమే అవకాశం లభించనున్నది.
ఐపీఎల్ 2022 (IPL 2022)మెగా వేలానికి (Mega Auction)బీసీసీఐ (BCCI) రంగం సిద్దం చేసింది. రెండు కొత్త జట్లకు అనుమతులు దాదాపు లభించడంతో అన్ని ఫ్రాంచైజీలకు వేలం తేదీల వివరాలను పంపించింది. ఈ ఏడాది అక్టోబర్లో రెండు కొత్త జట్లకు టెండర్లు నిర్వహించగా.. అహ్మదాబాద్ ఫ్రాంచైజీని సీవీసీ క్యాపిటల్, లక్నో ఫ్రాంచైజీని ఆర్పీఎస్జీ గ్రూప్ దక్కించుకున్నాయి. అయితే అహ్మదాబాద్ ఫ్రాంచైజీని దక్కించుకున్న సీవీసీ క్యాపిటల్పై పలు ఆరోపణలు వచ్చాయి. బెట్టింగ్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు బిడ్డింగ్లో పాల్గొన్న ఇతర సంస్థలు పిర్యాదు చేశాయి. దీంతో బీసీసీఐ ముగ్గురు స్వతంత్ర నిపుణుల కమిటీని నియమించింది. ఆ కమిటీ సీవీసీ క్యాపిటల్కు క్లీన్ చిట్ ఇచ్చినట్లు సమాచారం. త్వరలో బీసీసీఐ అహ్మదాబాద్ ఫ్రాంచైజీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు బోర్డు నుంచి విశ్వసనీయ సమాచారం. దీంతో రెండు కొత్త జట్లకు 'ఫ్రీ పికప్' (Free Pickup) ఆప్షన్ అందుబాటులోకి రానున్నది.
వాస్తవానికి అయితే నవంబర్ 30 పాత జట్ల ప్లేయర్ రిటెన్షన్ ముగిసిన తర్వాత డిసెంబర్ 1 నుంచి 25 వరకు కొత్త జట్లకు ఈ అప్షన్ వర్తించాలి. కానీ అహ్మదాబాద్కు గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ఫ్రీ పికప్ ఆప్షన్ను కాస్త వాయిదా వేశారు. ఈ ఆప్షన్ జనవరి 1 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఫ్రీ పిక్ జనవరిలో ముగియనున్నందున.. ఫిబ్రవరి రెండో వారంలో మెగా ఆక్షన్ నిర్వహించడానికి బీసీసీఐ సన్నాహాలు మొదలు పెట్టింది. ఇప్పటి వరకు రెండు కొత్త జట్లకు పూర్తి స్థాయిలో అనుమతులు ఇవ్వనందున వేలం పాట ఏ రోజు జరుగుతుందనే విషయంపై సందిగ్దత నెలకొన్నది. అయితే తాజాగా మెగా వేలాన్ని రెండు రోజుల పాటు నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా మెగా వేలం నిర్వహించనున్నట్లు ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలకు సమాచారం అందించింది.
ఫిబ్రవరి 11న ముందుగా 10 ఫ్రాంచైజీలకు వేలం పాటకు సంబంధించిన సమావేశాన్ని ఏర్పాటు చేసింది. వేలంలో ఆటగాళ్లను ఎలా కొనుగోలు చేయాలి? పర్స్ వాల్యూను ఏ విధంగా ఉపయోగించాలనే విషయాలతోపాటు.. ఫ్రాంచైజీ తరపున ఎవరెవరు పాల్గొనాలనే విషయాలను కూడా వివరించనున్నది. ఇప్పటికే అన్ని దేశాల క్రికెట్ బోర్డులకు తమ క్రికెటర్లను ఐపీఎల్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని బీసీసీఐ సమాచారం పంపించింది. ప్రపంచ వ్యాప్తంగా భారత క్రికెటర్లతో కలిపి 1000 మంది రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉన్నది. ఆయా ఫ్రాంచైజీలు విడుదల చేసిన క్రికెటర్లు కూడా మరోసారి రిజిస్ట్రేషన్ చేసుకోవలసి ఉంటుంది.
1000 మంది ప్లేయర్లు రిజిస్ట్రేషన్ అయినా.. కేవలం 250 మందిని మాత్రమే వేలం వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఐసీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ స్క్యూటినీ చేసిన ఆటగాళ్లు మాత్రమే ఆక్షన్ పూల్లోకి వస్తారు. ఇప్పటికే రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు, కొత్తగా రెండు జట్లు పికప్ చేసే ఆరుగురు తప్ప మిగిలిన వాళ్లందరినీ ఆయా ఫ్రాంచైజీలు కొనుగోలు చేయాల్సిందే. ఈ ఏడాది పర్స్ వాల్యూ రూ.90 కోట్లుగా ఉన్నది. రిటైన్/పికప్ చేసుకునే ఆటగాళ్ల విలువను రూ. 90 కోట్ల నుంచి మినహాయించగా మిగిలిన సొమ్ముతోనే ఆటగాళ్ల కొనుగోళ్లు చేయాల్సి ఉంటుంది.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:John Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.