ఐపీఎల్ 2021 (IPL 2021) సీజన్కు ఇప్పుడు కోవిడ్ (Covid-19) పెద్ద అవరోధంగా మారింది. 29 మ్యాచ్లు ముగిసిన తర్వాత కోల్కతా నైట్ రైడర్స్ క్రికెటర్లకు కరోనా సోకడంతో సోమవారం నాటి మ్యాచ్ వాయిదా పడింది. అయితే ఇలా జరుగుతుందని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ (IPL Governing Council) ముందే హెచ్చరించిందా? అయినా బీసీసీఐ (BCCI) తన పంతాన్ని నెగ్గించుకోవడానికి ఇండియాలోనే లీగ్ నిర్వహిస్తున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తున్నది. ఐపీఎల్ ప్రారంభానికి సరిగ్గా వారం రోజుల ముందు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఒక కీలక సూచన చేసింది. దేశంలో కరోనా సెకెండ్ వేవ్ తీవ్రంగా వ్యాపిస్తున్న సమయంలో ఇక్కడ లీగ్ నిర్వహించడం సవాళ్లతో కూడుకున్నదని.. తప్పకుండా అడ్డంకులు వస్తాయని.. కాబట్టి యూఏఈకి తరలించాలని చెప్పింది. కానీ బీసీసీఐ పెద్దలు మాత్రం గవర్నింగ్ కౌన్సిల్ మాటలు పట్టించుకోకుండా ఇండియాలోనే లీగ్ నిర్వహణకు మొగ్గు చూపినట్లు తెలుస్తున్నది. ఈ మేరకు బీసీసీఐలోని ముఖ్య అధికారి ఒకరు ఈ విషయాన్ని జాతీయ మీడియాకు లీక్ చేశారు. 'ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మొదటి నుంచి యూఏఈ వేదిక వైపే మొగ్గు చూపింది. లీగ్ ప్రారంభానికి వారం ముందు కూడా బోర్డుకు ఇదే సూచన చేసింది. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు కూడా వారంలోగా ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చింది. కానీ బీసీసీఐ పెద్దలు ఈ ప్రతిపాదనను తిరస్కరించారు.' అని సదరు అధికారి చెప్పాడు.
ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఇంగ్లాండ్ జట్టు ఇండియాలో పర్యటించింది. చెన్నై, అహ్మదాబాద్, పూణే వేదికల్లో వన్డే, టెస్టు, టీ20 మ్యాచ్లు నిర్వహించారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా సిరీస్ విజయవంతంగా పూర్తవడంతో ఆ ధీమాతో ఐపీఎల్ ఇండియాలోనే నిర్వహించాలని బీసీసీఐ పెద్దలు భావించినట్లు తెలుస్తున్నది. అయితే ఆరు వేదికల్లో పలు విడతల్లో మ్యాచ్లు నిర్వహించడం.. బయోబబుల్ రక్షణ పెంచడం వల్ల ఎలాంటి ఆటంకాలు ఉండవని అనుకున్నది. కానీ ఐపీఎల్ ప్రారంభమైన 20 రోజులకే కోవిడ్ కేసులు బయటపడంతో బీసీసీఐ ఇప్పుడు పునరాలోచనలో పడింది.
కోల్కతా నైట్ రైడర్స్ ఆటగాళ్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ల కేసులు బయటపడిన కొద్ది గంటల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలో కరోనా కలకలం రేగింది. ముఖ్యంగా ఆటగాళ్లతో క్లోజ్ కాంటాక్ట్లో ఉన్న బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ కరోనా పాజిటివ్గా తేలడంతో ఇప్పుడు జట్టు మొత్తం క్వారంటైన్లో ఉన్నది. బుధవారం రాజస్థాన్ రాయల్స్తో జరగాల్సిన మ్యాచ్ కూడా ఆడమని చెన్నై యాజమాన్యం బీసీసీఐకి సమాచారం అందించింది. వరసగా మ్యాచ్లకు అంతరాయాలు రావడంతో ఐపీఎల్ భవిష్యత్పై నీలినీడలు కమ్ముకున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.