టీమ్ ఇండియా (Team India) మేనేజ్మెంట్, బీసీసీఐ (BCCI) మధ్య మరో చిన్న యుద్దం నడిచింది. ఇంగ్లాండ్ పర్యటనకు (England Tour) వెళ్లిన క్రికెటర్లకు కరోనా (Corona) సోకి ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్న సంగతి తెలిసిందే. వికెట్ కీపర్, బ్యాట్స్మాన్ రిషబ్ పంత్ ప్రస్తుతం కరోనా సోకి ఐసోలేషన్లో ఉన్నాడు. సపోర్టింగ్ స్టాఫ్లో ఒకడైన దయానంద్ గరానీకి కోవిడ్ సోకింది. ఆయనతో క్లోజ్ కాంటాక్ట్లో ఉన్న వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహ, బ్యాకప్ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ క్వారంటైన్కు వెళ్లారు. ప్రస్తుతం వీరి ముగ్గురు కరోనా నెగెటివ్ వచ్చినా.. బ్రిటన్ కోవిడ్ రూల్స్ ప్రకారం మరి కొన్ని రోజులు క్వారంటైన్కే పరిమితం కానున్నారు. కాగా, అగస్టు 4 నుంచి మొదటి టెస్ట్ ప్రారంభం కానున్నది. అందకు ముందు భారత జట్టు దుర్హామ్లో రెండు టూర్ మ్యాచ్లు ఆడనుంది. ఈ రెండు టూర్ మ్యాచ్లకు పంత్, సాహ అందుబాటులో లేకపోతే కేఎల్ రాహుల్ కీపర్గా బరిలోకి దిగనున్నాడు. అయితే తమకు మరో ఇద్దరు బ్యాట్స్మెన్ను బ్యాకప్ కోసం పంపించాలని టీమ్ ఇండియా కోరింది. దీనికి బీసీసీఐ తిరస్కరించినట్లు బోర్డు అధికారి ఒకరు చెప్పారు. ఇప్పటికే అక్కడ బ్యాకప్ కూడా అందుబాటులో ఉన్నదని.. అలాంటప్పుడు అక్కడికి అదనంగా క్రికెటర్లు ఎందుకని ప్రశ్నించినట్లు తెలుస్తున్నది.
భారత జట్టు 20 మంది సభ్యులతో పాటు నెట్ బౌలర్లుగా నలుగురిని ఇంగ్లాండ్ పంపించారు. గతంలో ఆస్ట్రేలియా వెళ్లినప్పుడు కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడితే రిజర్వ్ ఆటగాళ్లైన వాషింగ్టన్ సుందర్, నటరాజన్, శార్దుల్ ఠాకూర్ తుది జట్టులోకి వచ్చారు. కేవలం బ్యాకప్ ప్లేయర్లుగా వెళ్లి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు కూడా బ్యాకప్ కోసం అభిమన్యు ఈశ్వరన్, ప్రసిధ్ కృష్ణ, ఆవేశ్ ఖాన్, అర్జాన్ నాగ్వాస్వల్లా ఉన్నారు. వీరిలో అభిమన్యు ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నారు. జట్టులో పంత్, సాహ తప్ప మిగతా టీమ్ అంతా సేఫ్ గానే ఉన్నది. కేఎల్ రాహుల్ను తుది జట్టులోకి తీసుకుంటే కీపింగ్తో పాటు ఓపెనింగ్ కూడా చేయగలడు. అంతే కాకుండా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కూడా అందుబాటులో ఉన్నాడు. ఇన్ని ఆప్షన్లు ఉంచుకోని కూడా మళ్లీ బ్యాకప్ కావాలని అడగటం ఏంటని బీసీసీఐ ప్రశ్నిస్తున్నది. ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే ఆటగాళ్లను ఇంగ్లాండ్ పంపేది లేదని.. ఉన్న ఆటగాళ్లతోనే సిరీస్ ముగించుకొని రావాలని ఆదేశించినట్లు తెలిసింది.
గతంలో డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత ఓపెనర్ శుభ్మన్ గిల్ గాయపడటంతో శ్రీలంక పర్యటనలో ఉన్న పృథ్విషా, దేవ్దత్ పడిక్కల్ను ఇంగ్లాండ్ పంపాలని టీమ్ ఇండియా యాజమాన్యం కోరింది. అప్పుడు కూడా బీసీసీఐ ఇలాగే స్పందించింది. సెలెక్టర్లు ఆల్రెడీ అవసరమైన బ్యాకప్తో సహా ఎంపిక చేసి ఇంగ్లాండ్ పర్యటనకు పంపారని.. అనవసరంగా అదనపు క్రికెటర్లను కోరవద్దని జట్టు యాజమాన్యాన్ని సున్నితంగా హెచ్చరించింది. అయినా సరే కోవిడ్ పేరుతో బ్యాకప్ కావాలని కోరడం గమనార్హం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bcci, Cricket, Team India