టోక్యో: జులై 23 నుంచి ఆరంభం కానున్న ఒలింపిక్స్కు సంబంధించి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్ థామస్ బాచ్ కీలక ప్రకటన చేశారు. గతంలో మాదిరిగా అథ్లెట్లకు మెడల్స్ మెడలో వేసి బహుకరించడం జరగదని ఆయన తెలిపారు. ఓ ట్రేలో అథ్లెట్కు ఆ మెడల్ను అందించడం జరుగుతుందని.. ఆ మెడల్ను స్వయంగా ఆ అథ్లెటే మెడలో వేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. గతంలో ఎన్నడూ ఇలాంటి మార్పు జరగనప్పటికీ కరోనా కట్టడి చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఆ మెడల్ను ట్రేలో ఉంచే వ్యక్తి కూడా గ్లౌవ్స్ ధరించి మెడల్ను ముట్టుకుంటాడని.. అథ్లెట్ కంటే ముందుగా ఆ మెడల్ను ఎవరూ తాకరని చెప్పారు. అంతేకాదు.. ఒలింపిక్స్లో క్రీడాకారులు గానీ, మరెవరు గానీ షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవడం, ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడం వంటివి గానీ ఉండదని థామస్ బాచ్ స్పష్టం చేశారు. ఒలింపిక్స్ క్రీడా గ్రామంలో కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి రోజూ క్రీడాకారులకు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. టోక్యో ఒలింపిక్స్లో దాదాపు 11 వేల మంది, పారాలింపిక్స్కు 4,400 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. అథ్లెట్లలో ఇప్పటికి 80 శాతం మందికి వ్యాక్సినేషన్ జరిగిందని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తెలిపింది.
ఇదిలా ఉండగా.. బుధవారం నాడు గత ఆరు నెలల్లో ఎన్నడూ లేనన్ని కరోనా కేసులు టోక్యోలో నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. 1,149 కొత్త కేసులు నమోదయ్యాయని, జనవరి 22 తర్వాత మళ్లీ ఆ స్థాయిలో అత్యధిక కేసులు నమోదు కావడం ఇదేనని ప్రభుత్వం తెలిపింది. ఒలింపిక్స్కు ఇప్పటికే ఫ్యాన్స్ను అనుమతించడం లేదని స్పష్టం చేసింది. మరికొన్ని రోజుల పాటు కేసులు పెరుగుతూ పోయే అవకాశం ఉందని టోక్యోలోని కియో యూనివర్సిటీ పరిశోధకులు హరుక సకమటో తెలిపారు.
జపాన్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా అత్యంత మందగొడిగా సాగుతోంది. ఇప్పటివరకూ కేవలం 31 శాతం ప్రజలకే ఫస్ట్ డోస్ ఇచ్చారంటే అక్కడ పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. టోక్యోలో నమోదయిన కేసుల్లో దాదాపు 30 శాతం కేసులు డెల్టా వేరియంట్వేనని తెలిసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Olympics, Tokyo Olympics