టోక్యో ఒలింపిక్స్ 2020కి (Tokyo Olympics 2020) అన్నీ గండాలే ఎదురవుతున్నాయి. కరోనా (Coronavirus) కారణంగా ఏడాది పాటు వాయిదా పడి విజయవంతంగా కొనసాగుతున్న ఒలింపిక్స్కు ప్రతీ రోజు ఏదో ఒక అవాంతరం ఎదురవుతూనే ఉన్నది. తాజాగా టోక్యోలో ఎండల తీవ్రత ఎక్కువై పోవడంతో మధ్యాహ్నం పూట ఆడే ఔవుట్ డోర్ క్రీడాకారులకు ఇబ్బందిగా మారింది. టెన్నిస్ ప్లేయర్లు (Tennis Players) మధ్యహ్నం పూట ఆడుతూ ఎండ వేడికి తట్టుకోలేక పోతున్నారు. దీంతో టోక్యో ఒలింపిక్స్లో మ్యాచ్ల సమయాన్ని (Timings Change) మారుస్తున్నట్లు ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ (ఐటీఎఫ్) (ITF) ప్రకటించింది. ఇకపై మధ్యాహ్నం మ్యాచ్లు 3.00 గంటల తర్వాతే ప్రారంభమవుతాయని ప్రకటించింది. తాజాగా జరిగిన ఒక మ్యాచ్లో వరల్డ్ నెంబర్ 2 డానిల్ మెద్వదేవ్ ఎండ వేడికి తట్టుకోలేక తీవ్ర ఇబ్బంది పడ్డాడు. ఆ సమయంలో చైర్ అంపైర్ను ప్రశ్నించాడు. తాను మ్యాచ్ను పూర్తి చేస్తాను కానీ ఈ ఎండకు చనిపోతే ఎవరు బాధ్యత తీసుకుంటాడని అసహనం వ్యక్తం చేశాడు. ఇతర క్రీడాకారులు కూడా వడదెబ్బకు గురవుతున్నారు. అసలే కరోనా కాలంలో వడదెబ్బ సోకి అథ్లెట్లు నీరసించి పోతే మరింత ప్రమాదం అని గుర్తించే మ్యాచ్ వేళలను మార్చినట్లు తెలుస్తున్నది.
టోక్యోలో ఉదయం 11.00 గంటల సమయానికే తీవ్రమైన ఎండతో పాటు ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. మధ్యాహ్నం తర్వాత ఎండగా ఉన్నా .. ఉష్ణోగ్రతలు మాత్రం తగ్గిపోతున్నాయి. అందుకే 3 గంటల తర్వాత ప్రారంభించాలని అథ్లెట్ల నుంచి కూడా విజ్ఞప్తులు వచ్చాయి. క్రీడాకారుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మ్యాచ్ వేళలను మారుస్తున్నట్లు ఐటీఎఫ్ ప్రకటించింది. సాధారణంగా జపాన్లో ఈ సమయంలో ఎక్కువగా ఎండలు ఉండవు. అయితే ఇటీవల తుఫాను కారణంగా ప్రస్తుతం ఉష్ణోగ్రతలు పెరిగాయి. జపాన్లో ఎండల తీవ్రత అంచనాలకు అందని విధంగా మారిపోతుంటుంది. రెండు రోజుల క్రితమే తుఫాను కారణంగా సర్ఫింగ్ క్రీడను రెండు రోజుల పాటు వాయిదా వేశారు. తాజాగా ఎండల కారణంగా షెడ్యూల్ మార్చాల్సి వచ్చింది.
In the interests of player health and welfare and following extensive consultation, Tokyo 2020 Olympic Tennis Event matches will begin at 3pm JST from Thursday 29 July#Tokyo2020 #tennis pic.twitter.com/skqh9ALRIV
— ITF Media (@ITFMedia) July 28, 2021
కాగా, టోక్యో ఒలింపిక్స్కు అసలైన పెద్ద గండం కరోనా రూపంలో వచ్చింది. గత ఏడాది జరగాల్సిన విశ్వ క్రీడలు ఏడాది పాటు వాయిదా పడ్డాయి. జులై 23న ఒలింపిక్స్ ప్రారంభానికి ముందే టోక్యోలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో క్రీడాకారులతో పాటు నిర్వాహకులు కూడా ఆందోళన చెందారు. అయితే క్రమం తప్పకుండా కరోనా పరీక్షలు నిర్వహిస్తుండటంతో పాటు.. క్రీడా గ్రామం, స్టేడియం, ఇతర వేదికల వద్ద కఠినమైన కరోనా నిబంధనలు అమలు చేస్తున్నారు. తొలి మూడు రోజుల్లో క్రీడా గ్రామంలో కేసులు నమోదు అయినా.. ఆ తర్వాత క్రమంగా తగ్గిపోవడంతో నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Olympics, Tokyo Olympics