ఫిట్ ఇండియా మూమెంట్లో (Fit India Movement) భాగంగా కేంద్ర ప్రభుత్వం (Central Government) ప్రతిష్ఠాత్మకంగా క్విజ్ పోటీలు (Quiz Show) నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ క్విజ్ పోటీలను ప్రపంచస్థాయిలో ఉత్తమమైన సాంకేతికతతో ఆన్లైన్, బ్రాడ్కాస్ట్ విధానంలో నిర్వహించనున్నారు. దీని కోసం కేంద్రం రకరకాల ఆలోచనలు చేస్తోంది. త్వరలో దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలుకాబోతోంది. దీనికి సంబంధించిన కీలక విషయాలు మీ కోసం...
ఫిట్ ఇండియా క్విజ్ కోసం కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రిజిస్ట్రేషన్లను ఆహ్వానిస్తోంది. ప్రతి స్కూలు నుంచి ఇద్దరి కంటే ఎక్కువమంది విద్యార్థులను నామినేట్ చేయాల్సి ఉంటుంది. వారు తొలుత ఆన్లైన్లో పోటీ పడతారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా క్విజ్ జరుగుతుంది. అందులో మెరుగైన ఫలితాలు సాధించిన వారిని విజేతలుగా నిర్ణయిస్తారు. అలా ఒక్కో రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం నుంచి 32 స్కూళ్లను స్టేట్ రౌండ్కు ఎంపిక చేస్తారు. అక్కడ ప్రొఫెషనల్ క్విజ్ మాస్టర్లు ఒక్కో విజేతను ఎంపిక చేస్తారు. అలా ఒక్కో రాష్ట్రం నుంచి ఒక స్కూలు.. అంటే మొత్తంగా 36 స్కూళ్లు జాతీయ రౌండ్కు ఎంపికవుతాయి. ఈ రౌండ్ను టీవీలో ప్రత్యక్షప్రసారం చేస్తారు.
స్టేట్ రౌండ్ క్విజ్లో వినూత్నమైన ఆప్షన్లను తీసుకురాబోతున్నారు. మీలో ఎవరు కోటీశ్వరుడు (కౌన్ బనేగా కరోడ్పతి) స్టైల్లో ‘ఫోన్ ఏ టీచర్/స్కూల్/ పేరెంట్’ లాంటి ఆప్షన్ ఉండబోతోంది. ఇందులో బజర్ రౌండ్, టాపికల్ రౌండ్, ఆడియో/వీడియో రికగ్నిషన్ రౌండ్ లాంటివి కూడా ఉండనున్నాయి. భారతీయ క్రీడల చరిత్ర, సంప్రదాయ క్రీడలు, యోగా, క్రీడా ప్రముఖులు, ఖేలో ఇండియా ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్, ఆసియన్ గేమ్స్కు సంబంధించిన ప్రశ్నలు క్విజ్లో సంధించబోతున్నారు. ఈ క్విజ్ను డెరెక్ ఓ బ్రెయిన్ హోస్ట్ చేయనున్నారు. స్టేట్ లెవల్ క్విజ్కు ప్రశ్నలు అందించడానికి, నిర్వహించడానికి ప్రభుత్వం ఓ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంటోంది. ఒక్కో రాష్ట్రానికి ఇద్దరు క్విజ్ మాస్టర్లను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నియమించనుంది.
జాతీయ క్విజ్కు వచ్చేసరికి క్వార్టర్ ఫైనల్స్, సెమీ ఫైనల్స్, ఫైనల్ రౌండ్స్ విధానంలో సాగుతాయి. ఈ పోటీలు జాతీయ టీవీ ఛానల్, ప్రైవేట్ స్పోర్ట్స్ ఛానల్, క్రీడా శాఖకు చెందిన సోషల్ మీడియాల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. క్విజ్లో గెలుపొందినవారికి క్యాష్ ప్రైజ్ అందిస్తారు. ఈ క్విజ్ పోటీలకు బోర్న్వీటా బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తోంది. ఫిట్ ఇండియా మూమెంట్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2019 ఆగస్టులో లాంచ్ చేసిన విషయం తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Evaru Meelo Koteeswarulu