IND vs AFG : నిత్యం బాంబుల మోతతో మార్మోగిపోయే అఫ్గానిస్తాన్ (Afghanistan)కు భారత్ అన్ని వేళలా అండగా నిలుస్తూ వస్తోంది. ముఖ్యంగా క్రీడల విషయంలో అఫ్గానిస్తాన్ కు అన్ని విధాలా సాయం చేస్తూ వస్తోంది. ముఖ్యంగా క్రికెట్ కు. అఫ్గానిస్తాన్ కు టెస్టు హోదా వచ్చిన తర్వాత.. ఆ దేశంతో టీమిండియానే తొలి టెస్టు మ్యాచ్ ఆడింది. అదే సమయంలో అఫ్గాన్ కూడా భారత్ కు విధేయత చూపుతూ వస్తూనే ఉంది. ఐపీఎల్ వల్ల అఫ్గాన్ ప్లేయర్స్ రషీద్ ఖాన్ (Rashid khan), ముజీబ్ ఉర్ రెహ్మాన్, నబీలాంటి క్రికెటర్లు వెలుగులోకి వచ్చారు. అయితే అఫ్గానిస్తాన్ ఫుట్ బాల్ జట్టు వీటన్నింటినీ మరిచింది. భారత ఫుట్ బాల్ జట్టు చేతిలో ఓడామన్న బాధతో భారత ఆటగాళ్లపైనే దాడికి దిగారు.
ఆసియా కప్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్ లో భాగంగా కోల్ కతా వేదికగా భారత్, అఫ్గాన్ జట్ల మధ్య శనివారం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ 2-1 గోల్స్ తేడాతో విజయాన్ని అందుకుంది. 85వ నిమిషం వరకు కూడా మ్యాచ్ లో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. కానీ భారత కెప్టెన్ సునీల్ చెత్రి ఆట 86వ నిమిషంలో గోల్ చేసి భారత్ కు ఆధిక్యాన్ని ఇచ్చాడు. అయితే మరో రెండు నిమిషాల తర్వాత అఫ్గాన్ ప్లేయర్ జుబీర్ అమీర్ హెడర్ తో గోల్ చేసి స్కోర్ ను సమం చేశాడు. ఇక మ్యాచ్ డ్రాగా ముగుస్తుందన్న తరణంలో ఇంజూరి టైమ్ లో భారత ప్లేయర్ సమద్ (91వ నిమిషంలో) గోల్ చేసి భారత్ కు థ్రిల్లింగ్ విక్టరీని అందించాడు.
మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానాన్ని వీడే క్రమంలో భారత ప్లేయర్ ఆకాశ్ మిశ్రాతో అఫ్గాన్ ప్లేయర్లు గొడవకు దిగారు. ఆకాశ్ పై ముగ్గురు ఆఫ్గాన్ ప్లేయర్లు దాడికి ప్రయత్నం చేయగా.. టీమిండియా గోల్ కీపర్ గుర్ ప్రీత్ సింగ్ అడ్డుకున్నాడు. ఈ క్రమంలో సబ్ స్టిట్యూట్ ప్లేయర్ గుర్ ప్రీత్ పై చేయి కూడా చేసుకున్నాడు. ఇక తన్నుకోవడమే తరువాయి అనే క్రమంలో మ్యాచ్ నిర్వాహకులు కల్పించుకుని గొడవను అడ్డుకున్నారు. అయితే అఫ్గాన్ ప్లేయర్లు భారత్ పై కాలు దువ్వడానికి మాత్రం కారణాలు తెలియరాలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Afghanistan, Fighting, Football, India