news18-telugu
Updated: September 24, 2020, 10:33 AM IST
వైఎస్ జగన్
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుమల పర్యటన ముగిసింది. వైఎస్ భారతి తండ్రి అనారోగ్యం నేపథ్యంలో సీఎం జగన్ పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. తిరుమల నుంచి ఆయన హైదరాబాద్కు బయలుదేరారు. రేణిగుంట ఎయిర్ పోర్టు నుంచి నేరుగా బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకోన్నారు. ఉదయం 11:20 గంటలకు నగరంలోని కంటినెంటల్ ఆసుపత్రికి వెళ్తారు. అనారోగ్య కారణాలతో చికిత్స పొందుతున్న వైఎస్ భారతి తండ్రిని సీఎం జగన్ పరామర్శించనున్నారు. అనంతరం తిరిగి నేరుగా బేగంపేట ఎయిర్ పోర్ట్ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం రానున్నారు.
తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం శ్రీవారి గరుడ సేవలో పాల్గొన్న ఏపీ సీఎ జగన్ గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. కర్నాటక సీఎం యడ్యూరప్పతో కలిసి ఆలయ ప్రవేశం చేసి వెంకటేశ్వర స్వామి దర్శించుకున్నారు. యడ్యూరప్పకు ఆలయ మహా ద్వారం వద్ద సీఎం జగన్ ఘన స్వాగతం పలికారు. శాలువతో ఆయన్ను సత్కరించారు. అనంతరం దర్శనానికి వెళ్తున్న సమయంలో తన మంత్రివర్గ సహచరులను యడ్యూరప్పకు పరిచయంచేశారు సీఎం జగన్. ఆ తర్వాత ఇద్దరూ కలిసి సుందరకాండ పారాయణంలో పాల్గొన్నారు.

శ్రీవారి ఆలయంలో వైఎస్ జగన్, యడియూరప్ప (Image:TTD)
అనంతరం కర్నాటక చౌల్ట్రి వద్ద రూ.200 కోట్లతో కర్ణాటక ప్రభుత్వం నిర్మించనున్న నూతన అతిధి గృహానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. కర్ణాటక ప్రభుత్వానికి సంబంధించి 7ఎకరాలు భూమిలో నూతన అతిధి గృహాన్ని కర్నాటక ప్రభుత్వం నిర్మించనుంది.
బుధవారం సాయంత్రం సీఎం జగన్ శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. పంచెకట్టు, తిరునామంతో.. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య ఊరేగింపుగా ఆలయం ప్రవేశం చేశారు. రాష్ట్రప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి హోదాలో పట్టువస్త్రాలు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం వకుళామాత దేవిని, ఆలయ ప్రదక్షిణగా విమాన వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. హుండీలో కానుకలు చెల్లించి, రంగనాయక మండపం చేరుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం క్యాలెండర్ను, డైరీని ఆవిష్కరించిన తర్వాత శ్రీవారి గరుడవాహన సేవలో పాల్గొన్నారు సీఎం జగన్.
Published by:
Shiva Kumar Addula
First published:
September 24, 2020, 10:31 AM IST