టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మరో అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి ఆయనకు ఆహ్వానం లభించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆన్ ఇండియా పేరుతో నిర్వహించే సదస్సుకు గౌరవ అతిథిగా హాజరు కావాల్సిందిగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం కేటీఆర్ను ఆహ్వానించింది. అక్టోబర్ 3, 4 తేదీల్లో ఢిల్లీలో సీఐఐ భాగస్వామ్యంతో ఈ సమావేశం జరగనుంది. మేకింగ్ టెక్నాలజీ వర్క్స్ ఫర్ ఆల్ అనే థీమ్ సదస్సును నిర్వహిస్తున్నారు. గత మూడు దశాబ్దాలుగా ఇండియా ఎకనామిక్ సమ్మిట్ పేరుతో నిర్వహిస్తున్న సమావేశాల తాలూకు విషయాలపై ఇందులో చర్చ జరగనున్నట్లు తెలిపారు.
కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ అనేక రంగాల్లో ముందంజ వేసిన విషయాన్ని ఈ సందర్భంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రత్యేకంగా ప్రస్తావించింది. మంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణలో ఇన్నోవేషన్ మరియు టెక్నాలజీ రంగంలో వినూత్నమైన కార్యక్రమాలను చేపట్టి దేశం దృష్టిని ఆకర్షించిన నేపథ్యంలో.. సదస్సుకు హాజరై తన అనుభవాలను పంచుకోవాలి వరల్డ్ ఎకనామిక్ ఫోరం కోరింది. తెలంగాణ అనుభవాలు ఇతర ప్రాంతాల్లో అమలు చేసేందుకు ఉపయుక్తంగా ఉంటాయని తెలిపింది.
ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత దేశం ఒకటని, ప్రపంచ మాంద్యంలో కూడా భారతదేశం సరైన అభివృద్ధిని నమోదు చేసిందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం తెలిపింది. భారతదేశం సైతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ అవకాశాలను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని, దీంతో పాటు ప్రపంచం సైతం భారత్లో ఉన్న అవకాశాలపై అవగాహన చేసుకోవలసిన అవసరమున్న నేపథ్యంలో ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యత కలిగినదని అభిప్రాయపడింది. అందుకే భారత దేశం లోని ఆదర్శవతమైన కార్యక్రమాలపై చర్చించడానికి ముఖ్యమైన వక్తలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులు సదస్సుకు హాజరు అవుతారని వరల్డ్ ఎకనామిక్ ఫోరం వెల్లడించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.