news18-telugu
Updated: May 17, 2019, 3:07 PM IST
అమరీందర్ సింగ్(File)
పంజాబ్ లోక్సభ ఎన్నికల్లో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే.. అందుకు తానే బాధ్యత వహిస్తానని సీఎం అమరీందర్ సింగ్ అన్నారు. అంతేకాదు, సీఎం పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. తనతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ గెలుపోటముల్లో బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. అయితే పంజాబ్లో కాంగ్రెస్ 13 లోక్సభ స్థానాల్లో గెలుస్తుందన్న నమ్మకం ఉందన్నారు.

పార్టీ గెలుపోటములకు మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత వహించాలని కాంగ్రెస్ హైకమాండ్ ముందే చెప్పింది. కాబట్టి గెలుపైనా.. ఓటమి అయినా.. బాధ్యత వహించడానికి నేను సిద్దంగా ఉన్నా. అయితే పంజాబ్లో అన్ని లోక్సభ స్థానాలను కాంగ్రెస్ స్వీప్ చేస్తుందని నేను భావిస్తున్నా.
— అమరీందర్ సింగ్, పంజాబ్ సీఎం
గత లోక్సభ ఎన్నికల్లో 13 లోక్సభ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ కేవలం 3 స్థానాల్లోనే గెలిచింది. బీజేపీ 6, ఆప్ 4 స్థానాల్లో విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటుతుందా..? లేక 2014 ఫలితాలే పునరావృతమవుతాయా? అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇదిలా ఉంటే, కాంగ్రెస్లో లోక్సభ టికెట్ల వివాదం సొంతగూటి నేతల మధ్యే చిచ్చు పెడుతోంది. మంత్రి నవజోత్ సింగ్ సిద్దూ సతీమణి, ఎంపీ నవజోత్ కౌర్.. తనకు టికెట్ రాకుండా అడ్డు తగిలారని సీఎం అమరీందర్పై ఆరోపణలు చేశారు అమరీందర్ మాత్రం అందులో తన ప్రమేయం ఏమీ లేదని.. అంతా హైకమాండ్ నిర్ణయమని తేల్చి పారేశారు.
Published by:
Srinivas Mittapalli
First published:
May 17, 2019, 12:21 PM IST