లోక్సభ ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంది. ఈ రోజు చిట్టచివరి 7వ విడత పోలింగ్ జరుగుతోంది. 8 రాష్ట్రాల్లో్ 53 లోక్సభ సీట్లలో అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు నేతలు తమ వంతు ప్రయత్నాలు చేశారు. కొన్ని చోట్ల డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేశారు. మద్యం జోరుగా ఏరులై పారింది. అదంతా ఓటును దక్కించుకోవడానికే. కానీ, ఓ చోట ఓటు వేయొద్దని డబ్బులు ఖర్చు చేయడం విశేషం. అదీకాక, ఓ షాకింగ్ పని కూడా చేశారు. ఉత్తరప్రదేశ్లోని తారాజీవన్పూర్లో ఈ రోజు పోలింగ్ జరుగుతోంది. అయితే, ముగ్గురు బీజేపీ కార్యకర్తలు ఓటర్లకు ఒక్కరికి చొప్పున రూ.500 ఇచ్చి ఓటు వేయొద్దని చెప్పడమే కాకుండా, ఓటు వేయకుండా ఉండేందుకు బలవంతంగా వారి వేళ్లకు సిరా ఇంకు పూశారట. పైగా, ఇక మీరు ఓటు వేయలేరు అని చెప్పి పంపించేశారని కొంతమంది ఆరోపిస్తున్నారు.
శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన గురించి కొంతమంది గ్రామస్థులు అధికారులకు వెల్లడించడంతో వెలుగులోకి వచ్చింది. ఓటు వేయకుండా అడ్డుకున్న ఆ ముగ్గురిపై చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. బీజేపీ యూపీ అధ్యక్షుడు డాక్టర్ మహేంద్రనాథ్ పోటీ చేస్తున్న చాంధౌలి లోక్సభ నియోజకవర్గం కిందకి ఈ గ్రామం వస్తుంది. అయితే, ఈ ఆరోపణలను కాషాయ పార్టీ ఖండించింది. తమపై బురద జల్లేందుకు ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయని పేర్కొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Election Commission of India, Lok Sabha Elections 2019, Uttar pradesh, Uttar Pradesh Lok Sabha Elections 2019