ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడి వచ్చే నెల 30కి రెండేళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి కేబినేట్ విస్తరణపైనే ఉంది. ప్రభుత్వం ఏర్పడిన రెండున్నరేళ్ల తరువాత మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు ఉంటాయని ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పడంతో ఇప్పటినుంచే ఆశావాహులు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. ముఖ్యంగా రోజా, భూమన కరుణాకర్ రెడ్డి, అంబటి రాంబాబు లాంటి నేతలు మంత్రిపదవులపై గంపెడాశలు పెట్టుకున్నారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఈ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతల మధ్య పోటీ నెలకొంది. ముఖ్యంగా కృష్ణాజిల్లా ఎమ్మల్యేలు కూడా మంత్రిపదవులపై కర్చీఫ్ వేసేందుకు సీరియస్ ట్రై చేస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. జగన్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత సామాజిక వర్గాల లెక్కల్లో భగంగా కొంతమంది ఎలాంటి ప్రయత్నాలు చేయకుండానే మంత్రిపదవులు దక్కించుకోగా.. పదవి వచ్చిందని దాదాపు ఫిక్సైపోయిన నేతలకు మాత్రం ఆ ఛాన్స్ దక్కలేదు. దీంతో త్వరలో జరగబోయే మార్పులు, చేర్పుల్లో భాగంగా మంత్రివర్గంలో చోటు దక్కించుకోవడం కోసం కృష్ణాజిల్లా ఎమ్మెల్యేలు ఇప్పటి నుంచే ప్రయత్నాలు సాగిస్తున్నారు.
ఐతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ జిల్లాకు దక్కని విధంగా కృష్ణాజిల్లాకు మూడు మంత్రిపదవులు ఇచ్చారు. కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ ఆమాత్యయోగం కల్పించారు. ఐతే ఈ ముగ్గురిలో ఎవర్ని రీప్లేస్ చేస్తారనేదానిపై పార్టీ వర్గాల్లో తీవ్రచర్చ జరుగుతోంది. జిల్లా వైసీపీలో కమ్మ సామాజికవర్గానికి పెద్ద దిక్కుగా ఉన్న కొడాలి నాని లాంటి వాళ్లను కొనసాగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కొడాలి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు లోకేష్, లాంటి వాళ్లపై విరుచుకుపడడం, ప్రభుత్వంపై వచ్చే విమర్శలను తనదైన శైలిలో తిప్పికొట్టడం ఆయనకు ప్లస్ పాయింట్లుగా ఉన్నాయి.
ఇక దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లిని మార్చే అవకాశాలు ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. దుర్గ గుడిలో జరిగిన అవినీతి, రాష్ట్రంలో దేవాలయాలపై జరిగిన దాడుల అంశాన్ని సరిగ్గా హ్యండిల్ చేయలేకపోవడం లాంటి అంశాలు ఈ మంత్రిగారిని ఇరుకున పెట్టేవిగా ఉన్నట్లు సమాచారం. వెల్లంపల్లిని మార్చుతారు అనే సమాచారంతో మల్లాది విష్ణు ఇప్పటికే తన గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం బ్రహ్మణ కార్పొరేష్ చెర్మన్ గా ఉన్న తనకు మరో ఆరు నెలల్లో మంత్రి పదవి రావడం ఖాయమనే భావనలో ఉన్నట్లు సమాచారం.
ఇక ఇదే జిల్లా నుంచి మంత్రి పదవులు ఆశిస్తున్నవారిలో పెడన ఎమ్మెల్యే జోగి రమేష్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఉన్నారు. ఐతే సామాజిక వర్గాల పరంగా ఇద్దరికి గట్టి పోటీ ఉంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన జోగి రమేష్ కు సీనియర్ నేత కొలుసు పార్ధసారధి రూపంలో పోటీ ఉంటే... కాపు సామాజిక వర్గానికి చెందిన ఉదయభానుకు మంత్రి పేర్ని నాని నుంచి పోటీ ఉంది. ఓసీ కేటగిరీకి వస్తే.. ఈయనకు మంత్రి కొడాలి నాని కూడా పోటీనే. మొత్తానికి మరి కొద్ది రోజుల్లో జరగబోయే క్యాబినేట్ విస్తరణకు ఇప్పటి నుంచే ఎవరి లెక్కలు వాళ్లు వేసుకుంటున్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్ మదిలో ఏ ముందో వేచి చూడాల్సిందేనని పరిశీలకులు చెప్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP cabinet, Ap cm ys jagan mohan reddy, Kodali Nani, MLA Roja