జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయగల, దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో మరోసారి కమలం వికసించింది. రైతుల ఉద్యమం, సీఏఏ, ఎన్సారీ ప్రయోగం, మైనార్టీ వర్గాల వ్యతిరేకత, హాత్రస్, లఖీంపూర్ ఖేరీ లాంటి హింసాకాండలు, ఎన్నికల ముందు భారీగా వలసలు.. వీటిలో ఏవి కూడా బీజేపీ విజయ గమనాన్ని నిలువరించలేకపోయాయి. రైతు ఉద్యమానికి కేంద్ర బిందువుగా ఉన్న పశ్చిమ యూపీలోనూ దాదాపు స్వీప్ చేస్తూ లీడింగ్ లో బీజేపీ మెజార్టీ మార్కును దాటేసింది.
ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. యూపీలో మొత్తం 403 స్థానాలకుగానూ బీజేపీ 246 చోట్ల లీడింగ్ లో ఉంది. గట్టి పోటీ ఇస్తుందనుకున్న సమాజ్ వాదీ పార్టీ కూటమి కేవలం 112 స్థానాల్లోనే ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నది. అనూహ్య రీతిలో మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ.. కాంగ్రెస్ కంటే దారుుణమైన ప్రదర్శన కనబరుస్తోంది. కాంగ్రెస్ 4 సీట్లలో, బీఎస్పీ 3 సీట్లల లీడ్ లో ఉంది. మజ్లిస్ పార్టీ ఎక్కడా ప్రభావం చూపినట్లు లేదు.
తొలిసారి అసెంబ్లీకి పోటీ చేసిన సీఎం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్ అర్బన్ స్థానంలో సమాజ్ వాదీ నుంచి పోటీ ఎదుర్కొంటున్నా, లీడ్ లో కొనసాగుతున్నారు. ఎస్పీ అభ్యర్థి సుభావతి ఉపేంద్ర దత్ శుక్లాపై యోగి ప్రతిసారి 5వేలకుపైగా లీడ్ లో కొనసాగుతున్నారు. అయితే ఓవరాల్ గా యూపీలో ప్రత్యర్థి పార్టీలకు కూడా అందనంత దూరంలో బీజేపీ నెంబర్లు ఉండటం గమనార్హం. ఇదే ట్రెండ్ కొనసాగితే తుది ఫలితాల్లో బీజేపీ 300 మార్కు దాటే అవకాశాలున్నాయి.
రైతుల పార్టీగా పేరుపొందిన ఆర్ఎల్డీతో, అర్బర్ ఓటర్ల ఆదరణ ఉందనుకునే ఆమ్ ఆద్మీ లాంటి పార్టీతో పొత్తులు పెట్టుకున్నా సమాజ్ వాదీ పార్టీకి పెద్దగా కలిసిరానట్లు ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. తొలిసారి అసెంబ్లీకి పోటీ చేస్తున్నసమాజ్వాదీ పార్టీ సీఎం అభ్యర్థి అఖిలేష్ యాదవ్ మాత్రం కర్హాల్ నియోజకవర్గంలో భారీ మెజారిటీ దిశగా దూసుకెళ్తున్నారు. కర్హాల్ స్థానంలో బీజేపీ మూడో స్థానంలో ఉండటం గమనార్హం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Assembly Election 2022, Bjp, Bsp, Samajwadi Party, Uttar Pradesh Assembly Elections