30 ఇయర్స్ పృథ్వీ మీద కొందరు దాడి చేశారు. కారు దిగిన వెంటనే ముఖం మీద పిడిగుద్దులు గుద్ది పారిపోయారు. ఈ విషయాన్ని పృథ్వీరాజ్ స్వయంగా వెల్లడించారు. ఎస్వీబీసీలో పనిచేసే మహిళా ఉద్యోగినితో చైర్మన్ పృథ్వీరాజ్ జరిపిన సరస సంభాషణ ఆడియో టేప్ బయటకు వచ్చింది. దీనిపై పెద్ద దుమారం రేగింది. దీనిపై టీటీడీ విజిలెన్స్ విచారణ జరిపింది. అనంతరం టీటీడీ ఆదేశాల మేరకు తన చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో జరిగిన సమావేశంలో ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా తన మీద కొందరు దాడి చేసిన విషయాన్ని బయటపెట్టారు.
‘ఈనెల 10వ తేదీన నా మీద కొందరు దాడి చేశారు. పిడిగుద్దులు గుద్ది పారిపోయారు. సహజంగా నేను క్రికెటర్ అందుకే ప్రతి రోజూ తెల్లవారుజామున నేను గ్రౌండ్కి వెళ్తూ ఉంటా. మొన్న పదోతేదీన తెల్లవారుజామున 5 గంటలకు కూడా క్రికెట్ గ్రౌండ్కి వెళ్లా. నేను కారులో దిగగానే కొందరు ముఖం మీద పిడిగుద్దులు గుద్దారు. ఆ తర్వాత పరిగెత్తారు. వారిని పట్టుకోవడానికి నేను కొంచెం దూరం పరిగెత్తా. అయితే, వారు దొరకలేదు. ఎవరో కాగితాలు ఏరుకునే వారు డబ్బుల కోసం దాడి చేశారని అనుకున్నా.’ అని పృథ్వీరాజ్ చెప్పారు.
తన గొంతుతో ఎవరో కావాలనే తనను ఇరికించారని పృథ్వీ ఆరోపించారు. ఈ విషయం మీద తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిస్థాయిలో విచారణ జరుపుతోందని చెప్పారు. ఆ రిపోర్టులు వచ్చిన తర్వాత తనకు క్లీన్ చిట్ వస్తుందని నమ్మకం ఉందన్నారు. ఆ తర్వాతే మళ్లీ ఎస్వీబీసీ చైర్మన్ పదవిని స్వీకరిస్తానని చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 30 Years Prudhvi Raj, Svbc, Ttd, Ysrcp