తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం తర్వాత సైలెంటైన టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరోసారి లైమ్లైట్లోకి వచ్చారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే 8 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డిని బరిలో నిలిపింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రేవంత్.. కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక.. కేసీఆర్ నియంతలా మారిపోయారని, రాక్షసుడిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ను మరో దావూద్ ఇబ్రహీంగా అభివర్ణించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ సంతలో పశువుల మాదిరి కొనుగోలు చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. ఈ పరిణామాలను చూడలేకే లోక్సభ ఎన్నికల్లో పోటీకి సిద్ధపడ్డానని చెప్పారు. సారు..కారు.. పదహారు అని కేటీఆర్ చెబుతున్నారని.. కానీ, అది సారు..కారు.. బేకారు అని రేవంత్ ఎద్దేవా చేశారు. 16ఎంపీ సీట్లు గెలిచి కేసీఆర్ ఏం సాధించలేరని.. గత ఎన్నికల్లో గెలిచి ఏం సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు.
తాను మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేస్తే మద్దతిస్తామని సబితారెడ్డి, సుధీర్ రెడ్డిలు చెప్పారని.. తెల్లారేసరికి పార్టీ మారిపోయారని చెప్పారు. పార్టీ కార్యకర్తలకు నాయకులు అండగా ఉండాల్సిన సమయం ఇదని, అందుకే ప్రజలను నమ్ముకుని పోటీకి సిద్ధమయ్యానని చెప్పారు. ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీల మధ్యే ఉంటుందని.. టీఆర్ఎస్ పార్టీ ఆటలో అరటి పండు లాంటిదని రేవంత్ సెటైర్ వేశారు. కాంగ్రెస్ గెలిస్తే రాహుల్ ప్రధాని అవుతారని, బీజేపీ గెలిస్తే మోదీ ప్రధాని అవుతారని.. మరి టీఆర్ఎస్ 16సీట్లు గెలిచి ఏం చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. 5 సంవత్సరాలుగా విభజన హామీలను సాధించలేకపోయారని ఆరోపించారు. ప్రజలు ధర్మంవైపు నిలబడతారని.. కాంగ్రెస్ను తప్పక గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAR, CM KCR, Revanth reddy, Telangana, Telangana Election 2018, Telangana News, Trs