తెలంగాణలో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమిగా ప్రతిపక్షాలతో జట్టుకట్టి ప్రజల్లోకి వెళ్లిన కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. ఓటమి నుంచి ఆ పార్టీ ఇంకా తేరుకోనే లేదు.. అప్పుడే సొంత నేతల మాటల తూటాలు పేలుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ తీరు మార్చుకోవాలని బాహాటంగానే విమర్శిస్తున్నారు. పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహా.. ఎన్నికల్లో ఓటమిపై తాజాగా స్పందించారు.
ప్రస్తుతం ఓటరు ఆలోచనా తీరు మారిందని, అందుకు తగినట్టుగానే కాంగ్రెస్ పార్టీ కూడా మారాల్సిన అవసరం ఉందని రాజనర్సింహా సూచించారు. పాత పద్ధతిలోనే ముందుకు సాగితే లాభం లేదన్నారు. ఓటమికి ముఖ్యంగా మూణ్నాలుగు కారణాలున్నాయన్న రాజనర్సింహా... అధికార దుర్వినియోగం, ఎన్నికల కమిషన్ వ్యవహారించిన తీరు, మద్యం ప్రభావం.. వంటివి కాంగ్రెస్ ఓటమిపై తీవ్ర ప్రభావం చూపాయని అభిప్రాయపడ్డారు. ఈసీ పూర్తిగా టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుందని ఆరోపించారు.
అయితే, ఈ ఓటమిలో సొంత పార్టీ తప్పిదం కూడా ఉందన్నారు దామోదర్. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పూర్తిగా విఫలమయ్యామన్నారు. తాను పోటీ చేసిన అందోల్లో స్థానికంగా మల్లన్నసాగర్ అంశంపై తప్పితే, ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయలేకపోయిందన్నారు. ఓటరు ప్రియారిటీ మారిందని, చివరి 20 రోజుల్లో ఏం చేశామన్నదే ప్రధానమైపోయిందని.. దామోదర్ చెప్పారు. అసలు, అభివృద్ధికీ.. ఓట్లకు.. గెలుపోటములకు.. సంబంధమే లేకుండా పోయిందన్నారు.
తాజా ఎన్నికల్లో టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా వ్యవహరించిన దామోదర్ రాజనర్సింహా.. అందోల్ నుంచి పోటీ చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి క్రాంతి కిరణ్ చేతిలో ఓడిపోయారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, Praja Kutami, Telangana, Telangana Election 2018, Telangana News, Tpcc, Trs