news18-telugu
Updated: August 9, 2019, 1:40 PM IST
రాజేంద్రప్రసాద్ (file photo)
తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రముఖులకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఇష్టం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సినీనటుడు, ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీకి సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారిని వెంటనే కలవడానికి సినీ నటులేమీ వ్యాపారవేత్తలు కాదని ఆయన అన్నారు. అయినా కళాకారులు సీఎంను కలవాలన్న నిబంధన ఏమీ లేదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ కుదురుకున్న తరువాత ఆయనను కలుస్తామని రాజేంద్రప్రసాద్ తెలిపారు. జగన్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆయన తెలిపారు.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ సినీ పరిశ్రమ పట్ల సానుకూలంగా ఉన్నారని రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించారు. ప్రజలకు తాగునీరందించే సీఎం తమకు దేవుడని అన్నారు. ఇదే అంశంపై కొద్ది రోజుల క్రితం వైసీపీ నేత, సినీనటుడు పోసాని కృష్ణమురళి కూడా పృథ్వీ వ్యాఖ్యలను తప్పుబట్టారు. సినీ పరిశ్రమకు జగన్ ముఖ్యమంత్రి కావడం ఇష్టం లేదనే విషయంలో నిజం లేదని అన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్ను కలిసేందుకు పలువురు సినీ ప్రముఖులు అపాయింట్మెంట్ కూడా కోరారని వ్యాఖ్యానించారు.
Published by:
Kishore Akkaladevi
First published:
August 9, 2019, 1:40 PM IST