(G.SrinivasReddy,News18,Khammam)
విలక్షణతకు పెట్టింది పేరైన ఖమ్మం జిల్లా స్థానిక ఎమ్మెల్సీ పోటీ రసవత్తరంగా మారింది. తమ సిట్టింగ్ స్థానాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటామన్న ధీమా తెరాస నేతల్లో వ్యక్తమవుతుండగా.. మరోవైపు అధికార పార్టీలో ఉన్న ఆధిపత్యపోరును కాంగ్రెస్(Congress) ఆసరా చేసుకుంటోంది. ఈ రెండు పార్టీల తరఫున బరిలోకి దిగుతున్న అభ్యర్థులు ఇరువురూ మాజీ కామ్రేడ్లు కావడం యాధృచ్ఛికమే అయినా, ఇద్దరూ గతంలో ప్రజారాజ్యం పార్టీలో కీలకంగా పనిచేసిన వాళ్లే కావడం గమనార్హం. పైపెచ్చు ఒకే సామాజికవర్గం కావడం, ఆర్థికంగా కూడా దాదాపు ఒకే స్థాయి వాళ్లు కావడం కూడా గమనార్హం. తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన తాతా మధుసూదన్ తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు స్వస్థలం. వామపక్ష విద్యార్ధి ఉద్యమాల నుంచి సీపీఎం(CPM)లో ఎదిగారు. అమెరికాలో హోటల్ వ్యాపారం (Hotel Business) చేస్తూ తానాలో కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు.
2009లో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో కీలక భూమిక పోషించారు. ఆ పార్టీ ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేకపోవడంతో తిరిగి అమెరికా వెళ్లిపోయారు. అనంతరం ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తిరిగి వచ్చి తెరాస పార్టీలో సంస్థాగత విధుల్లో కీలకంగా ఉన్నారు. సామాజికవర్గం, ఎన్నారైగా ఉన్న గుర్తింపు, వామపక్ష ఉద్యమ నేపథ్యం, ఇంకా సీఎం కేసీఆర్తో ఉన్న పరిచయం, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరెడ్డితో ఉన్న చిన్ననాటి స్నేహం తాతా మధుసూదన్కు కలిసొచ్చిన అంశాలుగా చెప్పుకోవచ్చు. సిట్టింగ్ స్థానం నిలబెట్టుకోవడం పార్టీకి ప్రతిష్ట కనుక మధుసూదన్ విజయానికి వచ్చిన ఇబ్బంది లేదు. కానీ ఆయన ప్రత్యర్థిగా బరిలోకి దిగిన రాయల నాగేశ్వరరావు సైతం వామపక్ష నేపథ్యం నుంచి వచ్చిన నాయకుడే. ప్రజారాజ్యం పార్టీ నుంచి 2009లో పాలేరులో పోటీ చేసిన నేపధ్యం.. మృధుభాషిగా ఉన్న పేరు.. సామాజిక వర్గం అండ, ఆర్ధిక వనరులు, వీటికి మించి తెరాస జిల్లా ప్రధాన నేతల మధ్య ఉన్న విభేదాలు తనకు కలిసొస్తాయన్న ఆశతో ఉన్నారు.
తక్కువ మంది ఓటర్లను నేరుగా సంప్రదించే పనిలో ఇప్పటికే ఆయన కాస్త ముందున్నట్టు చెబుతున్నారు. ఇక వందకు పైగా ఉన్న ఆదివాసీ స్థానిక ఓటర్ల అండతో ఆదివాసీల ఆత్మగౌరవ నినాదంతో బరిలోకి దిగిన కొండ్రు సుధారాణి ఎవరి అవకాశాలను దెబ్బతీస్తారో చూడాల్సి ఉంది. ఇక ఎంపీటీసీ ల సంఘం నుంచి బరిలోకి దిగిన కొండపల్లి శ్రీనివాస్ ప్రభావం కూడా కొట్టేయదగినది కాదు. నామినేషన్ల ఉపసంహరణల గడువు ముగిసిన నాటికి వీరు నలుగురు బరిలో మిగిలారు. ఇక పోటీ ప్రధానంగా తెరాస, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్యే అయినా మిగిలిన ఇద్దరూ పొందే ఓట్లు కీలకం కానున్నాయి. నిజానికి ఖమ్మం ఉమ్మడి జిల్లా స్థానిక ఎమ్మెల్సీ సీటు ఖచ్చితంగా గెలవాల్సినది. కానీ వాస్తవ పరిస్థితి అలా ఉన్నట్టుగా లేదు. ఉద్దండులు ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెరాస పరిస్థితి అనుకున్నంత ఈజీగా ఉన్నట్టు కనిపించడం లేదు. తెరాస అధినేత, సీఎం కేసీఆర్ సీనియర్లను కాదని మరీ ఓ కొత్త వ్యక్తికి టికెట్ కేటాయించారు.
ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతా మధుసూదన్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతో ఒక్కసారిగా అప్పటిదాకా అవకాశం కోసం ఎదురుచూసిన వారిలో నిరాశ ఆవహించింది. వాస్తవానికి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిలలో ఒకరికి టికెట్ ఇచ్చి మంత్రిగా అవకాశం ఇస్తారన్న ప్రచారం జరిగింది. కానీ ఇవేవీ కార్యరూపం దాల్చలేదు. వీరికితోడు సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న బాలసాని లక్ష్మీనారాయణ, గ్రానైట్ వ్యాపారి గాయత్రి రవి తెరాస నుంచి అవకాశం కోసం చూశారు.
ప్రయత్నాలు చేశారు. రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్తో ఉన్న బంధుత్వం తనకు కలిసొస్తుందన్న ధీమాతో ఉన్న గాయత్రి రవికి కూడా నిరాశే ఎదురైంది. ఇంకా స్థానిక ఓటర్లైన కార్పోరేటర్లు, కౌన్సెలర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఈ ఎన్నికల పట్ల ఎన్నో ఆశలు పెట్టుకున్నట్టు చెబుతున్నారు. తమకు కనీసం గుర్తింపు లేదని, నిధులు లేవని జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ప్రభుత్వం పట్ల ఆగ్రహంగా ఉన్నారు. ఇక కౌన్సెలర్లు, కార్పోరేటర్లు సైతం తమ ఎన్నికల ఖర్చుల వివరాలను చూపుతున్నట్టు చెబుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో అయినా పార్టీ అధినాయకత్వం తమను పట్టించుకుంటుందన్న ఆశలు వారిలో కనిపిస్తున్నాయి.
వారి ఆశల విషయంలో ఏదైనా తేడా జరిగితే కష్టమేనన్న చర్చ కూడా ఉంది. ఇక అధికార పార్టీలో సీనియర్ల మధ్య ఉన్న ఆధిపత్య పోరు ఎలాంటి పరిస్థికి దారితీస్తుందోనన్న బెరుకు ఉంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో కలిపి మొత్తం 769 ఓట్లు ఉండగా, తెరాసకు 497, కాంగ్రెస్కు 116, సీపీఐ 34, సీపీఎం 26, తెదేపా 19, న్యూడెమోక్రసీకి 15 ఇంకా బీజేపీకి 1, ఇండిపెండెంట్లు 60 ఓట్లున్నాయి. అయితే లెక్కలను బట్టి చూస్తే తెరాసకు తిరుగులేకున్నా, అది ఎంతవరకు ఒక్కటిగా బ్యాలెట్ బాక్సులో పడతాయన్న సంశయం అధికార పార్టీ నేతలను వెంటాడుతోంది.
పార్టీలో ఆధిపత్య పోరు ఒకవైపు ఇబ్బంది పెడుతుండగా, కీలకమైన ఆదివాసీ ప్రజా ప్రతినిధుల ఓట్లను సుధారాణి కొల్లగొట్టే పరిస్థితి ఉందన్న భయం ఇంకోవైపు కనిపిస్తోంది. వెరసి తెరాసకు విజయం నల్లేరుపై నడక కాదు అన్నది ప్రస్తుత పరిస్థితిగా చెప్పొచ్చు. ఇప్పటికే తెరాస అభ్యర్థి గెలుపు బాధ్యతను తీసుకున్న పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వరరెడ్డి, రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్కుమార్లు బాధ్యతగా తీసుకున్నారు. అన్ని జిల్లాల్లోని ఓటర్లను ప్రత్యక్షంగా కలిసే పనిలో తీరికలేకుండా ఉన్నారు. వచ్చే నెల 10వ తేదీన జరగనున్న ఎన్నిక దాకా ఐక్యతను పట్టుకురావడం, ఓటర్లను ప్రభావితం కాకుండా చూసుకోవడం అందరికీ కత్తిమీద సాములా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.