TENSIONS SITUATION AT MUNICIPAL ELECTIONS NOMINATIONS WITH DRAW TDP LEADERS PROTESTS NGS TPT
Municipal Elections: నామినేషన్ల ఉప సంహరణ రచ్చ రచ్చ.. ఎస్ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు.. ఆందోళనలు
నామినేషన్ల ఉప సంహరణ గొడవ
Municipal Elections fight: ఏపీలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ వ్యవహారం తీవ్ర రచ్చ రచ్చ అయ్యింది. స్థానిక అధికారుల తీరును నిరసిస్తూ కుప్పం, నెల్లూరుల్లో టీడీపీ శ్రేణుల ఆందోళనకు దిగారు. దీంతో అర్థరాత్రి వరకు హై డ్రామా కనిపించింది. పోలీసులు బలవంతంగా టీడీపీ నేతలను తరలించాల్సి వచ్చింది. అధికారుల తీరుపై ఎస్ఈసీకి ఫోన్లో చంద్రబాబు ఫిర్యాదు చేశారు.
Municipal Elections: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వ్యాప్తంగా మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల (Municipal and local elections) ప్రక్రియ ఉపసంహరణ రచ్చ రచ్చగా మారింది. కొందరు స్థానిక అధికారుల తీరుపై విపక్షాలు భగ్గు మన్నాయి. ముఖ్యంగా కుప్పం (Kuppam), నెల్లూరు (Nellore)ల్లో తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) శ్రేణులు ఆందోళనకు దిగాయి. కుప్పం మున్సిపాలిటీలో 14వ వార్డులో టీడీపీ అభ్యర్థులు ప్రకాష్, తిరుమగళ్ నామినేషన్లను ఫోర్జరీ సంతకాలతో ఉపసంహరించి.. ఆ వార్డును అధికార వైసీపీ (YCP)కి ఏకగ్రీవం చేశారని ధ్వజమెత్తారు. నెల్లూరులో మొదట ఎనిమిది వార్డులను ఏకగ్రీవంగా ప్రకటించారు. ఆ తర్వాత కమిషనర్ దినేష్కుమార్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. అధికారుల తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) తీవ్రంగా ధ్వజమెత్తారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడతారనే... మా వాళ్లు నామినేషన్లు వేశాక, ఆ పత్రాల్ని, చెక్లిస్ట్ని ఆర్వోకి, కలెక్టర్కి, ఎస్ఈసీకి, కొందరైతే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా పంపించారని, కానీ యథేచ్ఛగా అక్రమాలు సాగిపోయాయని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు. నెల్లూరు, కుప్పం, దర్శి ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఫిర్యాదు చేశారు. అభ్యర్థుల తుది జాబితాలు సకాలంలో ప్రకటించకుండా ఫోర్జరీ సంతకాలతో టీడీపీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరిస్తున్నారని తెలిపారు. తక్షణం ఎన్నికల ప్రక్రియ నిలుపుచేసి, సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్య తీసుకోవాలని కోరారు.
ఇక ప్రకాశం జిల్లా దర్శిలో టీడీపీ అభ్యర్థి బి-ఫారం ఇవ్వడానికి వెళితే, సంతకం సరిగా లేదని తిరస్కరించడం దారుణమన్నారు. ప్రజా స్వామ్యంలో మీ ఆటలు సాగవు. కొంత మంది అవినీతి అధికారులు అధికారపక్షానికి బానిసత్వం చేస్తున్నారు. వాళ్లను వదిలిపెట్టం అని చంద్రబాబు హెచ్చరించారు. నెల్లూరు జిల్లాలోనూ చాలా చోట్ల స్థానిక అధికారులు.. వైసీపీ నేతలకు సహకరించడం దారుణమన్నారు.
నెల్లూరులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఇతర నేతలు ఆందోళనకు దిగారు., ఎమ్మెల్సీ అశోక్బాబు, పార్టీ అధికార ప్రతినిధి గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్తో పాటు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సోమవారం రాత్రి ఎస్ఈసీ కార్యాలయానికి చేరుకొని నిరసన తెలిపారు. రాత్రి తొమ్మిది గంటలు దాటాక... దాదాపు అన్ని చోట్లా అభ్యర్థుల తుది జాబితాల్ని ప్రకటించారన్న సమాచారం వచ్చాక వారు వెనుదిగారు.
కుప్పంలో ఫోర్జరీ సంతకాలతో నామినేషన్ల ఉపసంహరణ
కుప్పం మున్సిపాలిటిలోని 14వ వార్డులో తమ అభ్యర్థులు ప్రకాష్, తిరుమగళ్ నామినేషన్లను ఫోర్జరీ సంతకాలతో ఉపసంహరించి.. ఆ వార్డును అధికార వైసీపికి ఏకగ్రీవం చేశారంటూ సోమవారం రాత్రి టీడీపీ శ్రేణులు కుప్పం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఆందోళనకు దిగాయి. సోమవారం మధ్యాహ్నం వరకు తమ దగ్గరే ఉన్న ప్రకాష్, తిరుమగళ్ అధికారుల దగ్గరకు వచ్చి ఏ విధంగా నామినేషన్లు ఉపసంహరించుకున్నారని వారు నిలదీశారు. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ దొరబాబు, మాజీమంత్రి అమరనాథరెడ్డి, చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నాని, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు కార్యాలయం ఎదుటే బైఠాయించారు. ఏదైనా ఉంటే న్యాయస్థానంలో తేల్చుకోవాలని కమిషనర్ చెప్పారు.
రాత్రి 9.30 గంటల వరకూ టీడీపీ శ్రేణులు ఆందోళన విరమించకపోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. నిమ్మల రామానాయుడు, అమరనాథరెడ్డి, నాని, దొరబాబును బలవంతంగా కార్యాలయం నుంచి బయటకు నెట్టారు. ఈ క్రమంలో అమరనాథరెడ్డి చొక్కా చినిగింది. దీనిని నిరసిస్తూ కమిషనర్కు చీర, గాజులు ఇచ్చేందుకు తెదేపా నేతలు ప్రయత్నించారు. ఈ ఘటనపై ఎమ్మెల్సీ దొరబాబు చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్తో ఫోన్లో మాట్లాడారు. ఎన్నికల అధికారులు తప్పు చేస్తే.. తాము ఎందుకు కోర్టును ఆశ్రయించాలన్నారు. న్యాయం జరిగే వరకు తాము అక్కడ నుంచి కదిలేది లేదన్నారు.
నెల్లూరు నగరపాలక సంస్థలో మొదట ఎనిమిది డివిజన్లు ఏకగ్రీవమైనట్లు కమిషనర్ దినేష్కుమార్ ప్రకటించి.. ఆ తర్వాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఎన్నికల అధికారుల వైఖరిపై తెదేపా నాయకులు సోమవారం రాత్రి కలెక్టరేట్లో నిరసన తెలిపారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెనాయుడు మాట్లాడుతూ అసలు అధికారులు చదువుకున్నారా.? ఎన్నికల నిర్వహణపై శిక్షణ తీసుకున్నారా.? అని ప్రశ్నించారు. ఓ అభ్యర్థి సమర్పించిన అఫిడవిట్లో సంతకం, స్టాంపు ఉన్నప్పటికీ పైన పేరు రాయలేదని కారణంతో రద్దు చేశారన్నారు. అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. ఈ విషయంపై గవర్నర్ స్పందించి విచారణ జరిపించాలని కోరారు.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.