మహిళలు సాధికారత సాధించేందుకు పురుషులు సహకరించాలని నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని హెచ్ఐసీసిలో మూడురోజులపాటు తెలంగాణ జాగృతి అంతర్జాతీయ యువ నాయకత్వ సదస్సును నిర్వహించింది. ఆదివారం సాయంత్రం జరిగిన ముగింపు సమావేశానికి రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ సమాజంలో సగ భాగం అయిన మహిళలకు ఆ స్థాయిలో ఎదిగేందుకు మరిన్ని అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
రెండు రోజుల పాటు జరిగిన సదస్సుకు 50 శాతానికి పైగా మహిళా ప్రతినిధులు హాజరయ్యారు అని చెప్పారు. సమాజంలో మహిళలు ఎదిగేందుకు అందించాల్సిన తోడ్పాటును బాధ్యతగా నెరవేర్చాలని సదస్సుకు హాజరైన ప్రతినిధులను కవిత కోరారు. గాంధేయ మార్గంలో సుస్థిర అభివృద్ధి, ఆవిష్కరణలు అంశంపై సదస్సు అన్నీ కోణాల్లో విస్తృతంగా చర్చించిందన్నారు.
వాటర్ మాన్ ఆఫ్ ఇండియా రాజేందర్ సింగ్ జన్మ దినాన్ని పురస్కరించుకుని తెలంగాణలో అనేక చోట్ల నీటి సంరక్షణ కార్యక్రమాలు మొదలయ్యాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నీటి సంరక్షణ చేపడుతూనే, నీటి వనరుల సద్వినియోగానికి కృషి చేస్తున్నదని కవిత వివరించారు. ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ అంతర్జాతీయ సదస్సుకు హాజరైన ప్రతినిధులకు పాలు అంశాలను వివరిస్తూ...భవిష్యత్ ప్రపంచ మార్గ నిర్దేశకులుగా తయారుకావాలని పిలుపు నిచ్చారు. సమావేశంలో వాటర్ మ్యాన్ రాజేంద్ర సింగ్, రెజ్లర్ బబిత, మాలోవత్ పూర్ణ పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, MP Kavitha, Nizamabad, Trs