తెలంగాణ కాంగ్రెస్ నేత, మల్కాజ్గిరి ఎంపీ అనుముల రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో రాజీవ్ రైతు భరోసా చేస్తున్న రేవంత్ రెడ్డి ఒక్కసారిగా తన దీక్షను పాదయాత్రగా మార్చేశారు. టీ కాంగ్రెస్ నేతలు మల్లు రవి, సీతక్క ఆయన పాదయాత్ర చేయాలని సూచించారు. దీంతో రేవంత్ రెడ్డి వెంటనే పాదయాత్ర మొదలు పెట్టారు. అచ్చంపేట నుంచి తాను హైదరాబాద్కు కారులో కాదని, పాదయాత్ర చేసుకుంటూ వెళ్తానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. రైతు సమస్యల మీద పోరాటం చేస్తున్న టీ కాంగ్రెస్ నేత గతంలో నిజామాబాద్లో దీక్ష చేశారు. ఈరోజు అచ్చంపేటలో దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి దీక్ష కాకుండా పాదయాత్ర చేస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన వస్తుందని భావించారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయాలని సూచించారు. దీంతో వారి ప్రతిపాదనకు రేవంత్ రెడ్డి ఓకే చెప్పారు.
సభలో రేవంత్ రెడ్డి ఏమన్నారు?
‘ఇక్కడి నుంచే కదం కదుపు నీ వెనుక మేం ఉంటామని అంతా అన్నారు. మా సీతక్క మా ఇంటి ఆడబిడ్డ ఆదేశం ఇచ్చింది. ఏ ముఖం పెట్టుకుని కారెక్కి ఇంటికి వెళ్తా. నాకు వయసు లేదా? ఓపిక లేదా? నేను రైతుల కోసం చెమట చిందించనా?’ అంటూ ప్రకటించిన రేవంత్ రెడ్డి వెంటనే తన పాదయాత్ర మొదలు పెట్టారు. అచ్చంపేట నుంచి హైదరాబాద్కు పాదయాత్ర ప్రారంభించారు.
అంతకు ముందు రాజీవ్ రైతు దీక్షలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు వారి తనఫున ప్రభుత్వంతో కొట్లాడే శక్తిని నల్లమల బిడ్డనైన తనకు ఇచ్చారని రేవంత్ రెడ్డి అన్నారు. రైతులు కోట్లు సంపాదించడానికి వ్యవసాయం చేయరని, ఎకరం భూమి ఉంటే దాన్ని ఆత్మగౌరవంగా భావించి వ్యవసాయం చేస్తారన్నారు. మార్కెట్లో ఏది కొనాలన్నా అమ్మేవాళ్లే ధర చెబుతున్నారని, కానీ రైతుల పంట అమ్మే సమయంలో మాత్రం కొనేవాళ్లు (దళారులు) ధర చెబుతున్నారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కార్పొరేట్ కంపెనీలకు రూ.15 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారని రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ సంస్కరణల చట్టాల్లో కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డులు, మద్దతు ధర లేదన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ఢిల్లీ వెళ్లి కేసీఆర్కు వంగి వంగి దండాలు పెట్టొచ్చారని రేవంత్ రెడ్డి విమర్శించారు. మోదీ, కేసీఆర్ ఇద్దరూ తోడు దొంగలేనన్నారు. రైతుల పంట కొనని కేసీఆర్కు సీఎం పదవి ఎందుకని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ స్వామినాథన్ కమిషన్ వేసి రైతులకు మద్దతు ధర ఇస్తే నరేంద్ర మోదీ శాంతకుమార్ కమిటీ వేసి రైతుల నాశనానికి రిపోర్టు తెచ్చారని మండిపడ్డారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.