‘కాంగ్రెస్ అడ్రసే లేదనుకున్న ఏపీలో అభ్యర్థికి 6 వేల ఓట్లు వచ్చాయి. అధికారంలోకి వచ్చే అవకాశాలున్న తెలంగాణలోనేమో కేవలం 3 వేల ఓట్లా? అసలు హుజూరాబాద్ లో ఏం జరిగింది? తాను పోటీ చేస్తానన్నా కొండా సురేఖకు రేవంత్ రెడ్డి టికెట్ ఇవ్వలేదు..’ అని ఒక నేత.. ‘ఈటల రాజేందర్ టీఆర్ఎస్ ను వీడిన తర్వాత ఆయనను కాంగ్రెస్ లో చేర్చుకోడానికి కారణం వీళ్లే..’అంటూ మరో నేత.. ‘కాంగ్రెస్ లో టీఆర్ఎస్ కోవర్డులున్నారు.. పరిస్థితి మారకుంటే ఇక పార్టీ క్లోజే..’అని ఇంకో నేత.. ఇలా తెలంగాణ నేతలు పరస్పరం ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్న ఘట్టం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో చోటుచేసుకుంది. టీనేతల తీరుతో చిర్రెత్తుకొచ్చిన ఏఐసీసీ పెద్దలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటల విషయంలో డబుల్ గేమ్ ఆడారంటూ కొందరు నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. మొత్తంగా తెలంగాణ కాంగ్రెస్ లో హుజూరాబాద్ రాజేసిన చిచ్చు ఏఐసీసీ భేటీతో మరింత పెద్దదైంది. వివరాలివి..
హుజూరాబాద్ ఫలితంపై పోస్ట్ మార్టం..
ప్రతిష్టాత్మక హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ అభ్యర్థిపై బీజేపీ ఈటల రాజేందర్ 24 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందడం, సదరు ఎన్నికలో ఇద్దరు ఇండిపెండెంట్లకు అటు ఇటుగా కాంగ్రెస్ అభ్యర్థి అయిన బల్మూరి వెంకట్ కు కేవలం 3వే ఓట్లు రావడం తెలిసిందే. హుజూరాబాద్ లో ఘోర పరాజయంపై గుర్రుగా ఉన్న కాంగ్రెస్ అధిష్టానం శనివారం నాడు ఢిల్లీలో సమీక్షా సమావేశం నిర్వహించింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టీ విక్రమార్క, సీనియర్ నేతలు దామోదర రాజనర్సింహ, వి.హనుమంతరావు, షబ్బీర్ అలీ, పొన్నం ప్రభాకర్ తదితర నేతలతోపాటు కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మణికం ఠాగూర్ సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ తరఫున ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ హాజరయ్యారు. భేటీలో ఈటలపై చర్చతోపాటు తీవ్ర వాదనలు, పరస్పర ఆరోపణలు, హెచ్చరింపులు, గద్దింపులతో సాగినట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా అందిన సమాచారం ప్రకారం..
కాంగ్రెస్ లోకి ఈటల రాలేదేం?
హుజూరాబాద్ అసెంబ్లీ స్థానంలో రెండేళ్ల కిందట 60 వేల ఓట్లు సాధించిన కాంగ్రెస్.. మొన్నటి ఉప ఎన్నికలో కేవలం 3వేల ఓట్లకు దిగజారడానికి కొందరు నేతల తీరే కారణమంటూ ఏఐసీసీకి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లాయి. ఈ నేపథ్యంలో ఏఐసీసీ ప్రధాన కాదర్యదర్శి కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో శనివారం నాడు తెలంగాణ నేతలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈటల రాజేందర్ ను కాంగ్రెస్ లోకి చేర్చుకుని ఉంటే బాగుండేదని, ఆయనను కాంగ్రెస్ లోకి రానీయకుండా కొందరు నేతలు అడ్డం పడ్డారని సీఎల్పీ నేత భట్టీ విక్రమార్గ వ్యాఖ్యనించగా, ఆ వ్యాఖ్యలపై కేసీ వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటలను కాంగ్రెస్ లోకి తీసుకోవద్దని చెప్పింది మీరే కదా? అని భట్టీని కేసీ నిలదీశారు. విక్రమార్క వ్యాఖ్యలపై కేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉత్తమ్ టీఆర్ఎస్ కోవర్టు..
మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ లో టీఆర్ఎస్ కోవర్టులు ఉన్నారంటూ ఉత్తమ్ కుమార్ పై ఫిర్యాదు చేశారు. కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ను వీడిపోయేందుకు ఉత్తమ్ సహకరించాడని, టీఆర్ఎస్ లో కౌశిక్ కు ఎమ్మెల్సీ పదవి ఇప్పించింది కూడా ఉత్తమేనని పొన్నం ఆరోపించారు. హుజూరాబాద్ లాగే గతంలో కాంగ్రెస్ దెబ్బతిన్న దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాలపైనా ఏఐసీసీ రివ్యూ మీటింగ్ నిర్వహించాలని కేసీని పొన్నం కోరారు.
రేవంత్ పై కొండా సురేఖ ఫిర్యాదు..
మరో సీనియర్ నేత వి.హనుమంతరావు మాట్లాడుతూ.. హుజూరాబాద్ ఓటమికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డే బాధ్యుడని ఫిర్యాదు చేశారు. ఆలస్యంగా అభ్యర్థిని ప్రకటించడం, ఆలస్యంగా ప్రచారం నిర్వహించడం రేవంత్ ఎత్తులేనని, అవన్నీ చిత్తయి పోయాయని, కాంగ్రెస్ ఓటు బ్యాంకు గల్లంతైపోయిందని, ఇందిరమ్మ నాటి నుంచీ ఉన్న అభిమానులు సైతం ఇవాళ కాంగ్రెస్ కు ఓటేయలేదని వీహెచ్ వ్యాఖ్యానించారు. హుజూరాబాద్ లో పోటీకి కొండా సురేఖ సిద్దంగా ఉన్నప్పటికీ, రేవంత్ రెడ్డే అడ్డుకున్నాడన్న వీహెచ్.. ఈ మేరకు సురేఖ పంపినట్లుగా చెప్పిన ఫిర్యాదు లేఖను వేణుగోపాల్ కు అందజేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aicc, Congress, Huzurabad, Huzurabad By-election 2021, Tpcc