తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరో టీ టీడీపీ నేతను టీఆర్ఎస్లోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం మండవ వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్లిన కేసీఆర్... ఆయనతో సమావేశమయ్యారు. టీఆర్ఎస్లో చేరాలని కేసీఆర్ మండవ వెంకటేశ్వరరావను కోరినట్టు తెలుస్తోంది. ఇందుకు మండవ కూడా సుముఖత వ్యక్తం చేశారని... రెండు మూడు రోజుల్లో ఆయన టీఆర్ఎస్లో చేరే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు కేబినెట్లో మండవ వెంకటేశ్వరరావు, కేసీఆర్ సహచరులుగా పని చేశారు. ఇద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఉంది.
అయితే రాజకీయంగా ఇద్దరి దారులు వేరు కావడంతో... ఈ ఇరువురు నేతలు పెద్దగా కలిసిన దాఖలాలు లేవు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మండవ వెంకటేశ్వరరావు టీఆర్ఎస్లోకి వస్తారని ప్రచారం కూడా జరిగింది. అయితే మండవ మాత్రం టీడీపీలోనే కొనసాగారు. తాజాగా లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తన కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవిత విజయానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసేందుకే కేసీఆర్ మండవను టీఆర్ఎస్లోకి ఆహ్వానించినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Lok Sabha Election 2019, MP Kavitha, Nizamabad S29p04, Telangana Lok Sabha Elections 2019, Trs