తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం వదులుకోవద్దని నిర్ణయించుకుంది. క్షేత్రస్థాయిలో బలం పెంచుకోవడంతో పాటు పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాలపై బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. తెలంగాణలోని పలు నియోజకవర్గాల్లో బీజేపీ పరిస్థితి బాగానే ఉందని ఆ పార్టీ అంతర్గత సర్వేల్లో తేలినట్టు సమాచారం. అయితే ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో మాత్రం పార్టీ పరిస్థితి ఆశించినంత మెరుగ్గా లేదని.. కాబట్టి ఈ సీట్లపై ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని బీజేపీ రాష్ట్ర నాయకత్వం కొంతకాలంగా భావిస్తోంది. తాజాగా ఈ విషయంలో ఏ విధంగా ముందుకు సాగాలనే దానిపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం కీలక కార్యాచరణ ప్రకటించింద. బీజేపీ ఎస్సీ నియోజకవర్గాల సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. అధికారంలోకి రావాలంటే ఎస్సీ నియోజకవర్గాలే కీలకమని వ్యాఖ్యానించారు.
ఈ క్రమంలో ఏప్రిల్ 14 నుంచి ఎస్సీ నియోజకవర్గాల్లో బహుజన పాదయాత్ర పేరిట 2 నెలల పాటు పాదయాత్ర చేపట్టబోతున్నట్టు వెల్లడించారు. ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపిక, సీట్ల కేటాయింపు జాతీయ నాయకత్వం చూస్తుందని ఆయన నేతలకు స్పష్టం చేశారు. పార్టీ పరిస్థితి, నేతల పనితీరుపై జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు సర్వే నిర్వహిస్తున్నాయని చెప్పుకొచ్చారు. నిజానికి తెలంగాణలో ఉన్న మొత్తం 19 ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ నేతలు కృషి చేయాలని బీజేపీ కొంతకాలం క్రితమే పార్టీ శ్రేణులకు సూచించింది. ఇందుకోసం ఎస్సీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై "మిషన్ -19" పేరుతో సమీక్షలు కూడా నిర్వహించింది.
అయితే ముందుగా ఎస్సీ రిజర్వ్’డ్ స్థానాల్లో పోటీ చేసేందుకు బలమైన అభ్యర్థులను ఎంపిక చేయాలని పార్టీ భావించింది. మిగతా నియోజకర్గాలకు కాస్త భిన్నమైన వ్యూహంతో ఈ స్థానాలపై దృష్టి పెట్టాలని.. ఇక్కడ పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపిక విషయంలో కాస్త ముందుగానే నిర్ణయం తీసుకుంటే అనుకున్న ఫలితాలు వస్తాయని నేతలు అభిప్రాయపడ్డారు. అయితే రాష్ట్రస్థాయిలో నేతలు ఈ రకమైన అభిప్రాయాలను వ్యక్తం చేసినప్పటికీ.. బీజేపీలో అభ్యర్థులు ఎంపిక ప్రక్రియ అంశం పూర్తిగా జాతీయ స్థాయి నాయకత్వం చూసుకుంటుంది కాబట్టి.. దీనిపై జాతీయ నాయకత్వం ఆలోచనలకు తగ్గట్టుగానే ముందుకు సాగాలని ఆ పార్టీ యోచిస్తోంది.
Telangana Cabinet: రేపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన.. కేబినెట్లో నిర్ణయం
KCR-YS Jagan: కేసీఆర్ ప్లాన్కు ఏపీ సీఎం జగన్ మద్దతు ఉంటుందా ?.. దూరంగానే ఉంటారా ?
స్థానికంగా నాయకులను బలోపేతం చేసుకోవడంతో పాటు ముందుగా ఆయా నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసుకోవడం కసరత్తు మొదలుపెట్టాలని బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వానికి సూచనలు చేసింది. ఇందులో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ఈ స్థానాల్లో పాదయాత్ర చేపట్టాలని నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణలో గెలుపు లక్ష్యంగా వ్యూహరచన చేస్తున్న బీజేపీ.. ఎంతో కీలకమైన ఎస్సీ నియోజకవర్గాలపై కూడా గట్టిగానే దృష్టి పెట్టినట్టు ఆ పార్టీ కార్యాచరణను బట్టి అర్థమవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.