TDP LEADER THANKS TO CM JAGAN TO POSTPONED TO INTER EXAMS HE WROTE ANOTHER LETTER TO POSTPONE ALL EXAMS IN MAY MONTH NGS
Andhra Pradesh: నా మాట విన్నందుకు కృతజ్ఞతలు.. ఇది కూడా చేయండి అంటూ జగన్ కు లోకేష్ లేఖ
తొలి సారి సీఎం జగన్ కు ధన్యవాదాలు చెప్పిన లోకేష్
సీఎం జగన్ లోకేష్ మాట విన్నారా? అందుకే జగన్ కు లోకేష్ కృతజ్ఞతలు చెప్పారా? అంతేకాదు ఆ వెంటనే మరో లేఖ కూడా రాశారు లోకేష్. ఈ డిమాండ్ ను గౌరవించాలని నారా లోకేష్ మరోసారి కోరారు.
ఏపీ సీఎం జగన్ (AP CM Jagan Mohan Reddy) కు తొలిసారి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) కృతజ్ఞతలు తెలిపారు. గత రెండు నెలలుగా నారా లోకేష్ విరామం లేకుండా ఇంటర్ పరీక్షలపై పోరాటం చేశారు. ఓ వైపు సీఎం జగన్ కు లేఖ (Nara Lokesh letter to CM Jagan) రాశారు. వెంటనే ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని.. లేదా వాయిదా వేయాలని కోరారు. అయితే అప్పటికి పరీక్షలు నిర్వహించి తీరుతామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. విధ్యార్థుల భవిష్యత్తు బాగుపడాలి అంటే పరీక్షలు తప్పని సరి అని జగన్ పదే పదే చెబుతూ వచ్చారు. ఉన్నత చదువుల కోసం సీటు దొరకాలి అన్నా. మంచి ఉద్యోగాలు రావాలన్నా ఈ పరీక్షల్లో మార్కులే ముఖ్యం అంటూ జగన్ స్పష్టం చేస్తూ వచ్చారు.
అయినా లోకేష్ తన పోరాటం ఆపలేదు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టారు. దాదాపు 2 లక్షల మంది అందులో పరీక్షలు రద్దు చేయడమే మేలని కోరారు. అయినా ప్రభుత్వం వెనక్కు తగ్గలేదు. దీంతో ఆయన గవర్నర్ కు కూడా లేఖ రాశారు. ఆ లేఖలో రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మంది అభిప్రాయాలు సైతం జత చేశారు. అయినా జగన్ ప్రభుత్వం వెనుకడుగు వేయలేదు. దీంతో నేరుగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అలాగే చాలామంది పరీక్షల రద్దుపై కోర్టును ఆశ్రయించారు. అయినా వెనక్కు తగ్గని ఏపీ ప్రభుత్వం ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ప్రకటించింది. హాల్ టికెట్లను కూడా డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది. అయితే కోరానా వేగంగా విస్తరిస్తున్న సమయంలో పరీక్షల నిర్వహణపై పునారాలోచన చేయాలని ప్రభుత్వానికి హై కోర్టు సూచించింది.
కోర్టు సూచనను గౌరవిస్తూ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో తన మూడు వారాల ఆందోళన, న్యాయపోరాటం తర్వాత ఇంటర్ పరీక్షలు వాయిదా వేసినందుకు సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు లోకేష్. ఇదే స్ఫూర్తితో, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మే నెలలో జరిగే అన్ని పరీక్షలు వాయిదా వేయాలని, లేదంటే రద్దు చేయాలని ఆయన కోరారు.
మే నెలలో ఆఫ్లైన్లో జరిగే పరీక్షలను కేంద్రం ఇప్పటికే వాయిదా వేసిందని లోకేష్ గుర్తు చేశారు. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వమూ నిర్ణయం తీసుకోవాలని కోరారు. మే నెలలో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో వివిధ రకాల ప్రవేశ పరీక్షలు, కళాశాలల సెమిస్టర్ ఎగ్జామ్స్, పోటీ పరీక్షలు జరగాల్సి ఉందని గుర్తు చేస్తూ మరో లేఖ రాశారు లోకేష్. పొరుగు రాష్ట్రాలతో పోల్చితే ఏపీలో కరోనా పరీక్షల నిర్వహణ లక్ష దాటడం లేదన్నారు. కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉండటంతో పాటు ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్ కొరతతో రోగులు చనిపోతున్న ఘటనలు తెలియనివి కాదని గుర్తు చేశారు. కరోనా తీవ్రత తగ్గుముఖం పడితే జూన్ మొదటి వారంలో పరిస్థితులపై సమీక్షించి అందుకు అనుగుణంగా పరీక్షల నిర్వహణపై తదుపరి నిర్ణయం తీసుకోవాలని లోకేశ్ సలహా ఇచ్చారు.
అయితే లోకేష్ లేఖపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఓ వైపు టీడీపీ అభిమానులు, జగన్ వ్యతిరేకులు అంతా మొత్తానికి లోకేష్ డిమాండ్ కు జగన్ తల ఊపారని అంటూ ట్వీట్లు చేస్తున్నారు. లోకేష్ అంటే అది.. మా నేత చాలా ముందు చూపుతో ఆలోచించారని, ప్రభుత్వానికి ఆ మాత్రం కూడా తెలియదని.. కక్ష రాజకీయాలు, టీడీపీ నేతలను టార్గెట్ చేయడం తప్ప.. సీఎం జగన్ కు ఏం పట్టదంటూ విమర్శిస్తున్నారు. అయితే అటు వైసీపీ అభిమానులు అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం.. కోర్టు సూచనల మేరకు సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటే.. అది తన గొప్ప అని లోకేష్ చెప్పుకోవడం సిగ్గు చేటు అంటున్నారు. టీడీపీ ఇంకా భ్రమల్లోనే ఉందని.. చంద్రాబు నాయుడులాగే లోకేష్ కూడా గొప్పలు చెప్పుకోవడానికి సమయం వెచ్చిస్తున్నారని వైసీపీ ఫాలోవర్లు కౌంటర్లు ఇస్తున్నారు.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.