ఆంధ్రప్రదేశ్లో హింసాత్మక ఘటనలు జరిగిన చోట్ల, రిగ్గింగ్ జరిగిందని ఆరోపణలు వచ్చిన పోలింగ్ బూత్ల్లో రీపోలింగ్ నిర్వహించాలా? వద్దా అనే అంశంపై శుక్రవారం నిర్ణయం తీసుకుంటామని ఏపీ సీఈవో జీకే ద్వివేదీ తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 80శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందన్న ద్వివేదీ.. ఈవీఎంలు ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని చెప్పారు. ఎన్నికల అబ్జర్వర్ల నుంచి రిపోర్ట్ తీసుకున్న తర్వాత తాము తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఏపీలోని పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ముఖ్యంగా రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో టీడీపీ-వైసీపీ మధ్య రాళ్లు రువ్వుకున్న ఘటనలు, ఘర్షణలు తలెత్తాయి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ-వైసీపీ మధ్య జరిగిన రాళ్ల దాడిలో టీడీపీ నేత సిద్దా భాస్కర్ రెడ్డి, మరో వైసీపీ నేత మృతి చెందారు. దీంతో అక్కడ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. గుంటూరు జిల్లాలో కూడా కోడెల మీద దాడి జరిగింది.
Read More
Load More
ఏపీలో 30 శాతం ఈవీఎంలు మొరాయించాయని, అక్కడ రీ పోలింగ్ నిర్వహించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అయితే, కేవలం 0.1 శాతమే ఈవీఎంలు సమస్య వచ్చిందని వాటిని సరిచేశామని ఈసీ తెలిపింది. పార్టీల ముఖ్య నేతలు జగన్ మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ లాంటివారు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. విజయవాడలో పవన్ కళ్యాణ్ క్యూలో నిలబడకుండా ఓటు వేయడానికి వెళ్లడంపై నిరసన వ్యక్తమైంది. రాజన్న రాజ్యం రాబోతుందని.. 140 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటామని వైసీపీ నాయకురాలు షర్మిల ధీమా వ్యక్తం చేశారు. అటు తెలంగాణ సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లా చింతమడకలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సతీమణి శైలిమతో కలిసి హైదరాబాద్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి 20 రాష్ట్రాలలోని 91 లోక్ సభ స్థానాలకు గురువారం అంటే ఏప్రిల్-11,2019న పోలింగ్ జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్,ఒడిషా,అరుణాచల్ ప్రదేశ్,సిక్కిం అసెంబ్లీ స్థానాలకు కూడా పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఆంధ్రప్రదేశ్లో 25 లోక్ సభ స్థానాలకు 45,920 పోలింగ్ సెంటర్లలో పోలింగ్ నిర్వహించారు. 319మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. టీడీపీ,వైసీపీ,జనసేన,కాంగ్రెస్,బీజేపీలు ప్రధాన పార్టీలుగా ఉన్నాయి .175 అసెంబ్లీ స్థానాలకు కూడా పోలింగ్ జరిగింది. ఇటు తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు 34వేల 603 పోలింగ్ సెంటర్లలో పోలింగ్ జరిగింది. 443మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. టీఆర్ఎస్,కాంగ్రెస్,ఏఐఎమ్ఐఎమ్,బీజేపీలు ప్రధాన పార్టీలుగా పోటీలో ఉన్నాయి. మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.