Anna Raghu, Guntur, News18
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో (AP CM YS Jagan Mohan Reddy) టాలీవుడ్ (Tollywood) హీరో నాగార్జున (Akkineni Nagarjuna) భేటీ కావడంపై తెలుగు రాష్ట్రాలతో పాటు సినీపరిశ్రమలో రకరకాలుగా చర్చ జరుగుతోంది. కేబినెట్ భేటీ వంటి ముఖ్యమైన సమావేశమున్నా సీఎం జగన్.., నాగార్జునకు అపాయింట్ మెంట్ ఇచ్చారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలపై చర్చించేందుకు నాగార్జున.. జగన్ తో భేటీ అయినట్లు తెలుస్తోంది. ఐతే ఈ భేటీపై కొన్ని పుకార్లు కూడా షికార్లు చేస్తున్నాయి. నాగార్జున వచ్చిన పని వేరే ఉందన్న చర్చలు కూడా జరుగుతున్నాయి. సినిమా సమస్యల గురించి చర్చిస్తే మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పేవారని.. సమాధానం దాటవేయడానికి ఇతర కారణాలున్నాయన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి.
సీఎంతో భేటీ తర్వాత హైదరాబాద్ వెళ్తూ.. జగన్ నా శ్రేయోభిలాషి అని.. ఆయన్ను కలిసి చాలా రోజులైందని.. అందుకే వచ్చానని సమాధానమిచ్చారు. ఏం చర్చించారనేదానిపై మాత్రం నాగ్ సైలెంట్ గానే ఉన్నారు. ఐతే నాగార్జున మీడియా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోవడం, కనీసం ఇండస్ట్రీ సమస్యలపై చర్చించినట్లు కూడా వెల్లడించకపోవడంతో ఏదైనా వ్యక్తిగత పనిమీద వచ్చారా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఐతే విశాఖపట్నంలో అన్నపూర్ణస్టూడియోస్ నిర్మిస్తున్నారు.. దానికి సంబంధించిన స్థలం కేటాయింపుపై చర్చించేందుకు వచ్చారన్న టాక్ కూడా వినిపిస్తోంది.
వైజాగ్ ను రాష్ట్ర రాజధాని చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అక్కడ స్టూడియోలు నిర్మించేందుకు టాలీవుడ్ పెద్దలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే విశాఖలో రామానాయుడు స్టూడియోస్ ఉన్నాయి. దీంతో నాగార్జున కూడా విశాఖపై ఆసక్తి చూపిస్తున్నారని.. తన ప్రతిపాదనలను సీఎం ముందుచారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
ఐతే సీఎంతో నాగార్జున భేటీపై మరొక విధంగా కూడా ప్రచారం జరుగుతోంది. సినిమా సమస్యలపై ప్రభుత్వంతో చర్చించేందుకు మెగాస్టార్ చిరంజీవితో పాటు నాగార్జున, దిల్ రాజు, సురేష్ బాబు, రాజమౌళి వంటి ప్రముఖులు లీడ్ తీసుకుంటున్నారు. ఇండస్ట్రీ సమస్యలపై సీఎంతో భేటీ అంటే కచ్చితంగా చిరంజీవి రావాలి కానీ.. వాళ్లెవరకూ లేకుండా నాగార్జున, మరో ఇద్దరు నిర్మాతే రావడం చర్చనీయాంశమైంది. ఇటీవల చిరంజీవి సోదరుడు, జనసేన పార్టీ అధినేత పవన్కళ్యాణ్.. ఏపీ ప్రభుత్వం నిర్వహించాలనుకుంటున్న ఆన్ లైన్ టికెటింగ్ పై వ్యాఖ్యలు చేయడం పెద్ద దుమారాన్నే రేపాయి. తర్వాత సినీ పెద్దగా చిరంజీవి వై.ఎస్.జగన్ను కలిసే అవకాశమే లేకుండా పోయిందని.. అందుకే నాగార్జున వచ్చారన్న మాట కూడా వినిపిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akkineni nagarjuna, Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy