హోమ్ /వార్తలు /రాజకీయం /

సర్పంచ్‌గా గెలిపించిన సోషల్ మీడియా.. 9 ఓట్లు అదనంగా తెచ్చిపెట్టింది

సర్పంచ్‌గా గెలిపించిన సోషల్ మీడియా.. 9 ఓట్లు అదనంగా తెచ్చిపెట్టింది

సోషల్ మీడియా ప్రచారం

సోషల్ మీడియా ప్రచారం

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో ప్రభావం చూపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. అందుకే ప్రధానమంత్రి మొదలు గల్లీ లీడర్ వరకు అంతా సోషల్ మీడియాను విస్తృతంగా వాడేసుకుంటున్నారు. తాజాగా ఆ సోషల్ మీడియానే తెలంగాణ పంచాయితీ ఎన్నికల్లో ప్రభావం చూపింది.

ఇంకా చదవండి ...

    సోషల్ మీడియా.. ఇప్పుడిది ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కన్నా పవర్ ఫుల్‌గా మారినట్టు కనిపిస్తోంది. ఈ డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ద్వారా ఎన్నో ఉపయోగాలున్నాయి మరి. గత ఎన్నికల్లో ప్రధాని మోదీతో సహా ముఖ్యనాయకులంతా సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకున్నారు. అందుకే, తమ ప్రచారం కోసం సోషల్ మీడియాలో ప్రత్యేకంగా ఓ విభాగాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు నాయకులు.

    అయితే.. తాజాగా జరిగిన తెలంగాణ గ్రామపంచాయితీ ఎన్నికల్లో సోషల్ మీడియాను ఉపయోగించుకొని లబ్ధి పొందారు ఓ యువ నాయకుడు. సంగారెడ్డి జిల్లాలో మేజర్ గ్రామ పంచాయితీ అన్నారానికి చెందిన మారం తిరుమల వాసు... మరోసారి సర్పంచిగా విజయం సాధించాడు.  గత టర్మ్‌లోనూ ఈయనే గ్రామ సర్పంచ్ గా పని చేశారు. సర్పంచ్ గా పని చేసిన కాలంలో గ్రామంలో తాను చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై ఓ లఘు చిత్రాన్ని రూపొందించిన వాసు... మళ్లీ అవకాశం కల్పిస్తే ఇంతకంటే మించి అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇస్తూ వీడియో రూపొందించారు. ఈ వీడియోను గ్రామంలోని వాట్సప్ గ్రూపుల్లోనూ, వ్యక్తిగతంగానూ షేర్ చేశారు. ట్విట్టర్, ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేశారు. వాటికి మంచి స్పందన వచ్చింది. ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం సుదూర ప్రాంతాల్లో ఉండే వాళ్లు సైతం వాసు వీడియోకు ఆకర్షితులైన ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ రోజున గ్రామానికి వచ్చి ఓటు వేశారు. దీంతో వాసు 9 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు.


    “ఓటు వేసేందుకు చాలా మంది వచ్చినా నాకు పక్కాగా ఓటు వేస్తారనుకున్న వారు పది మంది ఉన్నారు. వారి వల్లే నేను తొమ్మిది ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించాను. వారు రావడానికి నా సోషల్ మీడియా ప్రచారం ఉపయోగపడింది. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా సేవ చేస్తా.” అంటున్నారు తిరుమల వాసు.


    గ్రామంలో ముగ్గురు అభ్యర్థులు సర్పంచ్‌గా పోటీ చేశారు. టీఆర్ఎస్ పార్టీ అనుబంధ సభ్యునిగా పోటీ చేసిన తిరుమల వాసుకు 1207 ఓట్లు రాగా.. కాంగ్రెస్ బలపరచిన అభ్యర్థి జయశంకర్ గౌడ్‌కు 1198 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ రెబల్ రాజుకు 1100 పై చిలుకు ఓట్లు పడ్డాయి.

    ఇంతటి హోరాహోరీ పోరులో సోషల్ మీడియా ప్రచారమే గట్టెక్కించిందని గట్టిగా నమ్ముతున్నారు వాసు.


    ఇది కూడా చూడండి:


    First published:

    Tags: Social Media, Telangana, Telangana Election 2018, Telangana News

    ఉత్తమ కథలు