SHARAD YADAV LJD PARTY MERGES WITH LALU RJD AFTER 25 YEARS LEADER SAYS IT IS FIRST STEP TOWARDS OPPN UNITY MKS
KCR లాంటి నేతల కల సాకారానికి తొలి అడుగు? -25 ఏళ్ల తర్వాత ఒక్కటైన మిత్రులు -LJD Merges RJD
లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్ (పాత ఫొటో)
విపక్షాలు ఏకమయ్యేదెప్పుడు? బీజేపీని నిలువరించేదెప్పుడు? అనే ప్రశ్నలకు తానే జవాబునంటూ ముందుకొచ్చారు శరద్ యాదవ్. ఆయన చేసిన పని మిగతా రాజకీయ పార్టీలకు సాధ్యం కాకపోవచ్చు. కానీ..
హిందూత్వ- జాతీయవాదం-సంక్షేమం అనే పవర్ ఫుల్ కాంబినేషన్ కుతోడు మోదీ మ్యాజిక్ సహకారంతో ప్రతి ఎన్నికలోనూ అప్రతిహతంగా దూసుకుపోతున్న బీజేపీని నిలువరించడానికి ప్రత్యర్థులు ముక్తకంఠంతో చెబుతున్న మాట.. విపక్షాల ఐక్యత. కావడానికి రెండే అక్షరాలైనా ప్రతిపక్షాల ఐక్యత చాలా కోణాల్లో దాదాపు అసాధ్యంగా గోచరిస్తుంది. ఎందుకంటే ఆయా పార్టీలకు ప్రాంతీయంగా, జాతీయ స్థాయిలో భిన్న విరోధులుంటారు. జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఆకాంక్షించే కేసీఆర్, మమతా బెనర్జీ లాంటి నేతలు అది కాంగ్రెసేతర కూటమి అయిఉండాలని భావిస్తారు. శరద్ పవార్ లాంటి నేతలు బీజేపీని ఎంతగా వ్యతిరేకిస్తారో కాంగ్రెస్ ను అంతగా అభిమానిస్తారు. మొన్నటి యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా ఏడు పార్టీలతో పొత్తు పెట్టుకున్న ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్.. బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతితో సంధి చేసుకోని కారణంగా మరో ఐదేళ్లు అధికారానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి. ఇలాగైతే విపక్షాలు ఏకమయ్యేదెప్పుడు? బీజేపీని నిలువరించేదెప్పుడు? అనే ప్రశ్నలకు తానే జవాబునంటూ ముందుకొచ్చారు శరద్ యాదవ్. ఆయన చేసిన పని మిగతా రాజకీయ పార్టీలకు సాధ్యం కాకపోవచ్చు. కానీ ఇగోలు, ఇజాలు పక్కనపెట్టి భావసారూప్యతతో కనీసం ఐక్యంగా ఉండొచ్చని శరద్ యాదవ్ అంటున్నారు..
జనాభా రీత్యా దేశంలో మూడో అతిపెద్ద రాష్ట్రం, రాజకీయ చైతన్యం పరంగా మిగతా రాష్ట్రాలకు ఓ దశాబ్దం ముందుండే బీహార్ లో సంచలన రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. లాలూ ప్రసాద్ యాదవ్ అధినేతగా ఉన్న రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) పార్టీలోకి శరద్ యాదవ్ నాయకత్వంలోని లోక్తాంత్రిక్ జనతా దళ్ (ఎల్జేడీ) పార్టీ విలీనమైంది. సీనియర్ సోషలిస్ట్ నేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ తన సొంత పార్టీ ఎల్జేడీని లాలూ ఆర్జేడీలో ఆదివారంనాడు విలీనం చేశారు.
ఈ సందర్భంగా శరద్ యాదవ్ మాట్లాడుతూ, విపక్షాల ఐక్యతకు తొలి అడుగుగా తమ పార్టీని ఆర్జేడీలో విలీనం చేసినట్టు చెప్పారు. బీజేపీని ఓడిపించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన తరుణం ఇదేనని అన్నారు. ప్రస్తుతం, యూనిఫికేషన్ అనేదే తమ ప్రాధాన్యతాక్రమమని, ఐక్య విపక్షానికి ఎవరు సారథ్యం వహించాలనేది తర్వాత ఆలోచిస్తామని ఆయన చెప్పారు. రాం మనోహర్ లోహియా, జయప్రకాశ్ నారాయణ్ లాంటి నేతల అడుగుజాడల్లో పెరిగిపెద్దయిన లాలూ, శరద్ యాదవ్లు 25 ఏళ్ల క్రితం ఎవరికి వారు విడిపోయారు. మళ్లీ ఇన్నాళ్లకు ఇరుపార్టీలు ఏకం కావడం విశేషం.
1997లో లాలూ ప్రసాద్ ఆర్ఎల్డీని స్థాపించినప్పుడు కొన్ని రాజకీయ విభేదాలతో శరద్ యాదవ్ దూరం అయ్యారు. కాలక్రమంలో జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ)లో చేరి నితీశ్ కుమార్ సహచరుడిగా వ్యవహరించారు శరద్ యాదవ్. అయితే, నితీశ్ యూటర్న్ తీసుకుని బీజేపీకి దగ్గర కావడంతో శరద్ యాదవ్ సొంతగా ఎల్జేడీ ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఎన్నికల్లో శరద్ యాదవ్ ప్రభావం పెద్దగా పనిచేయలేదు. చివరికిప్పుడు తన పార్టీని లాలూ ఆర్జేడీతో విలీనం చేస్తున్నట్లు, దీనిని విపక్షాల ఐక్యతగా చూడాలంటూ శరద్ యాదవ్ పేర్కొన్నారు.
రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) పార్టీలోకి లోక్తాంత్రిక్ జనతా దళ్ (ఎల్జేడీ) విలీనంపై ప్రస్తుత ఆర్జేడీ చీఫ్, బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ స్పందించారు. శరద్ యాదవ్ తమకు తండ్రి వంటివారని తేజస్వి అభివర్ణించారు. భారత రాజకీయాల్లో సోషలిస్ట్ నేతగా శరద్ యాదవ్ చెరగని ముద్ర వేసుకున్న విషయం ప్రతి ఒక్కరికీ తెలుసునని, ఆయన తమకు మార్గదర్శకులని తేజస్వీ కొనియాడారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.