ఏపీసీసీ చీఫ్గా శైలజానాథ్ బాధ్యతలు చేపట్టారు. విజయవాడలో ఏపీసీసీ అధ్యక్షుడిగా శైలజానథ్, వర్కింగ్ ప్రెసిడెంట్గా తులసిరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీ కాంగ్రెస్ ఇంచార్జి ఉమెన్ చాందీ, తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాజ్యసభ్యుడు కేవీపీ రామచంద్రరావుతో పాటు ఏపీ, తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన శైలజానాథ్.. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏమాత్రం ఆలోచన లేకుండా పరిపాలన సాగిస్తోందని విమర్శలు గుప్పించారు. టీడీపీ, జనసేన, వైసీపీలకు ప్రజల సమస్యలు పట్టడం లేదని విరుచుకుపడ్డారు. శాసనమండలి రద్దుకు తీర్మానం చేసిన జగన్.. దమ్ముంటే సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముమ్మాటికీ కాంగ్రెస్ మనిషేనని స్పష్టం చేశారు శైలజానాథ్.
ఇక ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుపై కాంగ్రెస్ ఏపీ ఇంచార్జి ఉమెన్ చాందీ మాట్లాడారు. ఏపీ వికేంద్రీకరణ బిల్లు, శాసన మండలి రద్దు వంటి నిర్ణయాలపై పార్టీలో సంస్థాగతంగా చర్చించాల్సి ఉందని.. ఆ తరువాతే తమ విధానాన్ని ప్రకటిస్తామని స్పష్టం చేశారు. అమరావతి ప్రాంత రైతులకు నష్టం కలిగించేలా ప్రభుత్వం ఎలాంటి చర్యలను తీసుకోకూడదని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AP Congress, AP News