SC QUASHES MAHA ASSEMBLY RESOLUTION TO SUSPEND 12 BJP MLAS FOR A YEAR PVN
Maharashtra : ఉద్దవ్ సర్కార్ కు షాక్..సత్యమేవ జయతే అంటూ ఫడ్నవీస్ ట్వీట్
ఉద్దవ్ ఠాక్రే(ఫైల్ ఫొటో)
SC On BJP MLA's Suspension : బీజేపీ ఎమ్మెల్యేలను నిరవధికంగా ఏడాదిపాటు సస్పెండ్ చేస్తూ మహారాష్ట్ర శాసనసభ చేసిన తీర్మానాన్ని శుక్రవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. హారాష్ట్ర అసెంబ్లీ నిర్ణయం తన అధికార పరిధిని మించి ఉందని పేర్కొన్న సుప్రీం..ఇది ప్రజాస్వామ్యానికే ప్రమాదమని వ్యాఖ్యానించింది.
SC On BJP MLA's Suspension : మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీలో అసభ్యకరంగా ప్రవర్తించారనే ఆరోపణలపై 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలను నిరవధికంగా ఏడాదిపాటు సస్పెండ్ చేస్తూ మహారాష్ట్ర శాసనసభ చేసిన తీర్మానాన్ని శుక్రవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. బీజేపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ విధించిన ఏడాది సస్పెన్షన్ రాజ్యాంగ విరుద్దమని, ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమని రాష్ట్ర ప్రభుత్వానికి చీవాట్లు పెట్టింది. మహారాష్ట్ర అసెంబ్లీ నిర్ణయం తన అధికార పరిధిని మించి ఉందని పేర్కొన్న సుప్రీం..ఇది ప్రజాస్వామ్యానికే ప్రమాదమని వ్యాఖ్యానించింది. అంతేకాకుండా సస్పెన్షన్ అనేది.. కొనసాగుతున్నసెషన్ లేదా ఆరు నెలలలోపే ఉండాలని గతంలో వ్యాఖ్యానించిన విషయాన్ని సుప్రీంకోర్టు మరోసారి ప్రస్తావించింది.
అసలు వివాదం ఏంటీ
గతేడాది జులైలో మహారాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్థానిక సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్ల కోసం సమాచారం సిద్ధం చేసేందుకు 2011 నాటికి జనాభా గణాంకాలను రాష్ట్ర బీసీ కమిషన్కు అందించాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది ప్రభుత్వం. దీనిపై చర్చ సందర్భంగా సభలో గందరగోళం తలెత్తింది. కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. అక్కడ ఉన్న ప్రిసైడింగ్ అధికారితో వాదనకు దిగారు. దీంతో తొలుత సభ వాయిదా పడింది. రోజులో మరో మూడుసార్లు సెషన్ వాయిదా వేయాల్సి వచ్చింది. సభ వాయిదా పడగానే బీజేపీ ఎమ్మెల్యేలు తన క్యాబిన్ వద్దకు వచ్చి ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్, బీజేపీ సీనియర్ నేత చంద్రకాంత్ పాటిల్ ఎదుట తనను దుర్భాషలాడారని స్పీకర్ భాస్కర్ జాదవ్ వివరించారు.
ఈ నేపథ్యంలో అసెంబ్లీలో దురుసుగా ప్రవర్తించారని పేర్కొంటూ 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఏడాదిపాటు సస్పెండ్ చేస్తూ స్పీకర్ ఇన్ ఛైర్ భాస్కర్ జాదవ్ నిర్ణయం తీసుకున్నారు. సస్పెండ్ అయిన 12 మంది బీజేపీ ఎమ్మెల్యేల్లో సంజయ్ కుటే, ఆశిష్ షెలార్, అభిమన్యు పవార్, గిరీష్ మహాజన్, అతుల్ భత్కల్కర్, పరాగ్ అలవ్ని, హరీష్ పింపాలే, రామ్ సత్పుటే, విజయ్ కుమార్ రావల్, యోగేష్ సాగర్, నారాయణ్ కుచే, కీర్తికుమార్ బంగ్డియా లు ఉన్నారు. దీనిపై మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమపై స్పీకర్ విధించిన ఏడాది సస్పెన్షన్పై బీజేపీ ఎమ్మెల్యేలు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు . 12 మంది బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది.
సుప్రీం తీర్పుపై మాజీ సీఎం ఫడ్నవీస్
సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన మాజీ సీఎం,బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ వరుస ట్వీట్ లు చేశారు." సత్యమేవ జయతే. సుప్రీం తీర్పుని స్వాగతిస్తున్నాం. 12మంది బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ ను రద్దు చేస్తూ చారిత్రక తీర్పు ఇచ్చిన గౌరవననీయ సుప్రీం న్యాయస్థానానికి ధన్యవాదాలు. ఇది 12 మంది ఎమ్మెల్యేల ప్రశ్న మాత్రమే కాదు, ఈ 12 నియోజకవర్గాల్లోని 50 లక్షల మందికి పైగా పౌరుల ప్రశ్న అని ఫడ్నవీస్ వరుస ట్వీట్ లలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా అధికార మహా వికాస్ అఘాడి(MVA)ప్రభుత్వంపై కూడా ఫడ్నవీస్ విమర్శలు గుప్పించారు. MVA రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ నిరంతరం నియంతృత్వ పద్ధతిలో ప్రభుత్వాన్ని నడుపుతోంది. దీనికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి బలమైన చెంపదెబ్బ. ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన, చట్టవిరుద్ధమైన, సమర్థించలేని రూపాలను ప్రజాస్వామ్యంలో ఎన్నటికీ సహించబోమని కోర్టు ఈరోజు తీర్పునిచ్చింది అని ఓ ట్వీట్ లో ఫడ్నవీస్ పేర్కొన్నారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.