news18-telugu
Updated: November 9, 2020, 4:41 PM IST
అశోక్ గజపతి రాజు, సంచయిత
చారిత్రాత్మక నేపథ్యం ఉన్న మన్సాస్ ట్రస్ట్ ఇటీవల కాలంలో వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ప్రారంభించిన సేవ్ మన్సాస్ క్యాంపెయిన్పై ఆ ట్రస్టు చైర్ పర్సన్ సంచయిత తీవ్ర విమర్శలు చేశారు. అది సేవ్ మన్సాస్ ఉద్యమం కాదని.. సేవ్ అశోక్ ఉద్యమం అని అన్నారు. తాను సేవ్ మన్సాస్ ఉద్యమాన్ని నడుపుతున్నానని.. పురాతన వైభవాన్ని తీసుకొస్తానని చెప్పుకొచ్చారు. అశోక్ గజపతి 8వేల ఎకరాల మన్సాస్ భూములను ఎకరా 500 రూపాయలకు తన అనుయాయులకు లీజ్కు ఇచ్చారని ఆరోపించారు. 2016-2020 మధ్య అశోక్ గజపతి రాజు సరైన సమచారం ఇవ్వకపోవడం మన్సాస్ విద్యా సంస్థలకు రూ. 6 కోట్ల నష్టం వచ్చిందని విమర్శించారు. అలాగే పలు ప్రశ్నలను కూడా సంధించారు. ఈ మేరకు వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు.
"సేవ్ మాన్సాస్ పేరుతో అశోక్ గజపతి రాజు గారు చేస్తున్నది నిజానికి సేవ్ అశోక్ క్యాంపైన్. ఆయన ఆధ్వర్యంలో మాన్సాస్ ఉన్నప్పుడు జరిగిన ఒక్కో అక్రమం బయటపడుతుండటంతో రాజకీయ అస్తిత్వాన్ని కోల్పోతున్నారాయన ... ఏం చేయాలో తెలియక పనికిరాని ఫక్తు రాజకీయం చేస్తున్నారు. అశోక్ గారూ . మీరు 150 ఏళ్ల చారిత్రాత్మక మోతీ మహల్ ను నేలమట్టం చేసినప్పుడు సేవ్ మాన్సాస్ ఉద్యాన్ని చేపట్టాల్సింది. మీరు 8 వేల ఎకరాల మాన్సాస్ భూములను ఎకరా 5 వందల రూపాయలకు అనుయాయులకు లీజుకి కట్టబెట్టినప్పుడు నిజానికి సేవ్ మాన్సాస్ ఉద్యమాన్ని చేయాల్సింది. మార్కెట్ ధరకు మీరిచ్చిన లీజులకు ఏమైనా సంబంధముందా?. మీకు కనీసం లాయర్ ను పెట్టుకోకపోవడం కూడా చేతకాక 13 కోట్ల నష్టాన్ని కలిగించే మాన్సాస్ భూములు ఎక్స్ పార్టీ డిక్రీ ద్వారా అన్యాక్రాంతమైనప్పుడు సేవ్ మాన్సాస్ ప్రారంభించాల్సింది. 2016- 2020 మధ్యకాలంలో మీరు సరైన సమాచారం ఇవ్వకపోవడంతో మాన్సాస్ విద్యా సంస్థలకు 6 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. అప్పుడు మొదలెట్టాల్సింది సేవ్ మాన్సాస్ క్యాంపైన్
మీరు ఛైర్ పర్సన్ గా ఉన్నప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ఉన్నత విద్యామండలి (APSCHE) నుంచి అవసరమైన అనుమతులు తెచ్చుకోకపోవడంతో 170 మందికిచ్చిన డిగ్రీలు చెల్లుబాటుకాకుండాపోయాయి... అప్పుడు చేయాల్సింది సేవ్ మాన్సాస్ ఉద్యమం. సరైన ఆడిటింగ్ నిర్వహించక... మ్యాన్యువల్ గా తప్పుడుతడకలతో ఆడిటింగ్ చేయించినప్పుడు సేవ్ మాన్సాస్ ఉద్యమం ప్రారంభిస్తే బయటపడేది అసలు రంగు. TDP ప్రభుత్వం ఉన్నప్పుడు మాన్సాస్కు రావాల్సిన 30 కోట్ల రూపాయల నిధులను రాబట్టుకోలేదు .అప్పుడు ఈ ఉద్యమం చేస్తే కొంతైనా ప్రయోజనం ఉండేది. ఆశోక్ గారూ... మీరు ఎంఆర్ కాలేజీపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తిలోకి తెచ్చారు. మీరు ఛైర్మన్ గా ఉన్నప్పుడే ఇది ఒక ప్రైవేట్ కాలేజ్. ప్రభుత్వం ఇచ్చే సహకారాన్ని (గవర్నమెంట్ ఎయిడెడ్) మీరే తీసేశారు. ఆ విధానమే ఇప్పుడు కొనసాగుతోంది. నేను... సేవ్ మాన్సాస్ ఉద్యమాన్ని నడుపుతున్నాను పురాతన వైభవాన్ని పునరుద్ధరిస్తాను. మీరు మీ రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకోండి" అని సంచయిత ట్విటర్లో పేర్కొన్నారు.
Published by:
Sumanth Kanukula
First published:
November 9, 2020, 4:37 PM IST