కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో తెలుగుదేశం పార్టీ ఎంపీల భేటీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలో సమస్యలు వైసీపీ ప్రభుత్వం తీరు, శాంతిభద్రతలు, ఆలయాలపై దాడులు, టీడీపీ నేతలపై దాడుల లాంటి అంశాలపై అమిత్ షాకు టీడీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. ఈ భేటీలో ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్, కేశినేని శ్రీనివాస్ పాల్గొన్నారు. రాష్టరంలో ప్రస్తుతం శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడుతోందని.. రాజ్యంగంబద్ధంగా ఏదీ జరగడం లేదని టీడీపీ ఎంపీలు అమిత్ షాకు చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే అమరావతి నుంచి రాజధాని తరలింపు, అంతర్వేది నుంచి రామతీర్థం వరకు రాష్ట్రంలోని ఆలయాలపై జరిగిన దాడులను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్లు టీడీపీ ఎంపీలు వివరించారు.
ఐతే టీడీపీ ఎంపీలు ఇంత సడన్ గా అమిత్ షాను కలవడం వెనుక మరో కారణముందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పాత స్నేహాన్ని మళ్లీ పునరుద్ధరించుకోవాలని... ఎన్టీఏలో చేరుతామన్నట్లుగా ఎంపీలు అమిత్ షా దగ్గర ప్రస్తావించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అధికార వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీ ఎదుర్కొంటున్న కష్టాలు, కేసుల నుంచి గట్టెక్కేందుకు.. బీజేపీకి దగ్గరవ్వడం ఒక్కటే మార్గమని టీడీపీ భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే చంద్రబాబు తన ఎంపీలతో రాయబారం నడిపారన్న వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని మిత్రపక్షాలు దూరమైనా మళ్లీ ఎన్డీఏ గూటికి చేరడంతో తమకు కూడా లక్ కలిసొస్తుందని టీడీపీ భావించే రీఎంట్రీ ప్రతిపాదనను అమిత్ షా ముందు పెట్టినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
2014లో కలిసి పోటీ చేసిన ఈ రెండు పార్టీలు 2018లో విడిపోయాయి. 2019లో విడిగా పోటీ చేయగా.. టీడీపీ 23 స్థానాలకు, బీజేపీకి సున్నాకు పరిమితమయ్యాయి. ఐతే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం, ఏపీలో వైసీపీ భారీ విజయం సాధించడం టీడీపీకి కష్టాలు తెచ్చిపెట్టింది.
టీడీపీని ఎన్డీఏలోకి తీసుకునేందుకు బీజేపీ అంత సముఖంగా లేదనే చెప్పాలి. అమిత్ షా తిరుమల వచ్చినప్పుడు రాళ్లు రువ్వడమే కాకుండా.. ఎన్నికల సమయంలో బీజేపీని, ప్రధాని మోదీపై ఘాటు వ్యాఖ్యలు చేయడం కూడా ఇందుకు కారణంగా చెప్పొచ్చు. ఇక ఎన్నికల సమయంలో మోదీపైనే యుద్ధం చేయాలన్నట్లు చంద్రబాబు చేసిన ప్రసంగాలు బీజేపీ ఆగ్రహానికి మరో కారణం. మరోవైపు ఏపీలో సొంతంగా ఎదిగేందుకు బీజేపీ యత్నిస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీని చేరదీస్తే మొదటికే మోసం వచ్చే అవశముంది. పైగా జనసేనతో ఇప్పటికే పొత్తు కొనసాగుతున్నందున ఏపీలో మరో పార్టీ అవసరం లేదని బీజేపీ భావిస్తోంది.
ఇదిలా ఉంటే అమిత్ షా తమకు ఇచ్చిన టైమ్ రాష్ట్రంలోని పరిస్థితులపై చర్చించడానికే సరిపోయిందని..., రాజకీయాలు, పొత్తుల గురించి మాట్లాడేందుకు అవకాశం లేదని టీడీపీ ఎంపీలు చెప్పినట్లు సమాచారం.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.