ఏపీలో అఖండ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ... ఇక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తరువాయిగా మారింది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయం కావడంతో... మంత్రులుగా ఎవరికి ఛాన్స్ దక్కుతుందనే అంశంపై ఆసక్తి నెలకొంది. మిగతా వారి సంగతి ఎలా ఉన్నా... వైసీపీ అధికారంలోకి వచ్చి రోజా కూడా ఎమ్మెల్యేగా గెలవడంతో ఆమెకు మంత్రి పదవి దక్కుతుందా లేదా అనే అంశంపై ఆసక్తి నెలకొంది. మే 30న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనుండటంతో... రోజాకు కేబినెట్లోకి తీసుకుంటారా అన్న దానిపై చర్చ మొదలైంది.
అయితే చిత్తూరు జిల్లా నుంచి మరో ఇద్దరు నేతలు మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఆ ఇద్దరికి మంత్రి పదవులు దక్కితే... రోజాకు మంత్రి పదవి రావడం కష్టమే అనే వాదనలు వినిపిస్తున్నాయి. చిత్తూరు జిల్లా నుంచి సీనియర్ నేత, మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కేబినెట్లో చోటు ఖాయమని వైసీపీ వర్గాల్లో ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. జగన్కు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన ఆయనకు మంత్రి పదవి దాదాపు ఖాయమనే చెప్పాలి. ఆయన తరువాత చిత్తూరు నుంచి కేబినెట్లో చోటు కోసం రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, నారాయణస్వామి వంటి వాళ్లు పోటీ పడుతున్నారు.
మరోవైపు మంత్రి పదవి విషయంలో భూమన కరుణాకర్ రెడ్డికి జగన్ హామీ ఇచ్చారని తాజాగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి, భూమనకు కేబినెట్లో చోటు దక్కితే... రోజా పరిస్థితి ఏమిటనే దానిపై రాజకీయవర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మరోవైపు ఆమెకు స్పీకర్ పదవి ఇవ్వాలని జగన్ నిర్ణయించుకున్నారనే వార్తలు కూడా రాజకీయవర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
స్పీకర్ పదవి తీసుకోవడానికి రోజా సుముఖంగా లేకపోతే డిప్యూటీ స్పీకర్ లేదా కేబినెట్ ర్యాంక్ కలిగిన చీఫ్ విప్ పదవిని ఆమెకు ఆఫర్ చేయాలని జగన్ భావిస్తున్నట్టు సమాచారం. సామాజిక సమీకరణాలు ఎలా ఉన్నా...వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ తరపున తన వాయిస్ను బలంగా వినిపించిన రోజాకు వైసీపీ ప్రభుత్వంలో కీలకమైన పదవి దక్కొచ్చని ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.