కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మూడు రోజుల పర్యటన నిమిత్తం కేరళలోని వయనాడ్ లోక్సభ నియోజకవర్గానికి శుక్రవారం చేరుకున్నారు. వయనాడ్ ఎన్నికల్లో తనను గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపేందుకు రాహుల్ ఇక్కడ పర్యటిస్తున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వయనాడ్ నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ కేరళ రాష్ట్రంలోనే అత్యధికంగా 4.31 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అమేథీలో స్మృతి ఇరానీ చేతిలో ఓటమి చెవిచూసిన రాహుల్ గాంధీకి...వయనాడ్ విజయం పెను ఊరట కలిగించింది.
కోళికోడ్ విమానాశ్రయంలో రాహుల్ గాంధీకి స్థానిక కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పార్టీ సీనియర్ నేత రమేశ్ చెన్నితల తదితరులు విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికారు. కలికవులో ఓటర్లను ఉద్దేశించి మాట్లాడిన రాహుల్ గాంధీ...ఎన్నికల్లో తనను గెలిపించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. వయనాడ్తో పాటు కేరళ ప్రజల సమస్యలను పార్లమెంటులో లేవనెత్తుతానని చెప్పారు. వయనాడ్ ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు, వారి గళాన్ని వినేందుకే తాను వచ్చానన్నారు. నియోజకవర్గంలో దాదాపు 15 చోట్ల జరిగే ధన్యవాద కార్యక్రమాల్లో రాహుల్ గాంధీ పాల్గొంటారు. పలు చోట్ల రోడ్ షోలు నిర్వహిస్తారు. ఈ నెల 9న ఢిల్లీకి రాహుల్ గాంధీ తిరుగుపయనం కానున్నారు.
రాహుల్ గాంధీ పర్యటన పట్ల స్థానిక కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. రాహుల్ పర్యటనతో పార్టీ శ్రేణులకు కొత్త ఉత్సాహం వస్తుందని, కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించేందుకు ఈ పర్యటన దోహదపడుతుందని చెబుతున్నారు.