ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి సలహాదారు పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీన్ని బట్టి చూస్తే ప్రశాంత్ కిషోర్ ఇకపై రాజకీయ పార్టీలకు అడ్వైజర్గా మాత్రమే కాకుండా.. ఓ రాజకీయ పార్టీలో చేరి 2024 ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది. ఇలా చూసుకుంటే రాబోయే 2022 ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్కి పెద్ద దెబ్బే అని చెప్పుకోవచ్చు. ప్రశాంత్ కిషోర్ ఆలోచనలు, స్ట్రాటజీలు లేకుండా ఆ పార్టీ ఎక్కువ సంఖ్యలో సీట్లు సంపాదించడం కష్టమే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
గత సంవత్సర కాలంగా ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని తరచూ కలుస్తూనే ఉన్నారు. వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో, కేంద్రంలో తిరిగి అధికారంలోకి రావడానికి పీకే సోనియా గాంధీకి సలహాలు ఇస్తున్నాడని చాలామంది భావించారు. అయితే కాంగ్రెస్ వర్గాల సమాచారం మేరకు వారిద్దరు కలిసేందుకు అసలు కారణం అది కాదట. కాంగ్రెస్ పార్టీని అంతర్గతంగా బలోపేతం చేయడానికి, పార్టీ నాయకత్వాన్ని, రూపురేఖలను పూర్తిగా మార్చడానికేనట. ఆయన సలహా మేరకు ముందు పార్టీని బలోపేతం చేస్తే.. 136 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న కాంగ్రెస్ ఇకపై మరిన్ని దశాబ్దాల పాటు అదే రీతిగా కొనసాగే వీలుందని పీకే సోనియా, రాహుల్, ప్రియాంకలకు వెల్లడించారట.
టికెట్లు ఇచ్చే ప్రక్రియను సంస్థాగతీకరించడం, ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తులు, పార్టీకి ఎలా నిధులు సమకూర్చాలి వంటి అంశాల గురించి వీరు ఎక్కువగా చర్చిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ ఛీఫ్ కమల్ నాథ్ కూడా ఈ మీటింగుల్లో అప్పుడప్పుడూ సోనియా, రాహుల్, ప్రియాంకలతో పాటు పాల్గొన్నారట. దీన్ని బట్టి చూస్తే ఆయనకు జాతీయ స్థాయిలో మంచి పదవి త్వరలో అందనుందని చెప్పుకోవచ్చు. కిషోర్ దీనికోసం క్షేత్ర స్థాయిలో కూడా చాలామంది కాంగ్రెస్ మెంబర్లను, ప్రాంతీయ కార్యకర్తలను, యువ నేతలను కలిశారు. వారంతా పీకే కాంగ్రెస్ తో చేరితే అది తమకు చాలా ప్రయోజనాన్ని కలిగిస్తుందని నమ్ముతున్నారట.
పీకే కాంగ్రెస్లో చేరడం గురించి రాహుల్ గాంధీ పార్టీ సభ్యులతో కూడా మాట్లాడినట్లు వార్తలొస్తున్నాయి. చాలామంది పార్టీ నేతలు ప్రశాంత్ కిషోర్ పార్టీలో చేరడాన్ని ఆహ్వానిస్తున్నా ఆయనకు అన్ని బాధ్యతలను ఒకేసారి అప్పగించకూడదని భావిస్తున్నారట. ప్రస్తుతానికి స్వల్ప కాలిక ఎన్నికలను పక్కన పెట్టి 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ను ముందుకు నడిపించడానికి మాత్రమే ప్రశాంత్ కిషోర్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రశాంత్ కిషోర్కు ప్రాంతీయ పార్టీల నేతలతో మంచి సంబంధాలున్నాయి. మమతా బెనర్జీ, శరద్ పవార్, స్టాలిన్, ఉద్దవ్ థాకరే, అఖిలేష్ యాదవ్, హేమంత్ సొరేన్, జగన్ మోహన్ రెడ్డి లాంటి వారితో దగ్గరి సంబంధాలున్న పీకే వీరిలో అత్యధికులకు పోల్ స్ట్రాటజిస్ట్గా కూడా వ్యవహరించారు. ఈ పార్టీలన్నింటితో ఆయా రాష్ట్రాల్లో పొత్తులు కుదిర్చి ఎన్డీయేపై సమిష్టి పోరాటం చేయడానికి కూడా పీకే కాంగ్రెస్కు తోడ్పడనున్నారు.
అయితే మార్పును స్వీకరించడానికి అంతగా ఇష్టపడని కాంగ్రెస్ పార్టీని పీకే అంత త్వరగా మార్చగలరా? 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ రిప్రెజెంటేటివ్గా ఆయన వ్యవహరించగలరా? అన్న విషయాలు ఆలోచించాల్సిందే. సోనియా గాంధీ ఏఐసీసీ తాత్కాలిక ఛీఫ్గా వ్యవహరించడం ప్రారంభించి రెండేళ్లు పూర్తి కానుంది. మరి ఈ సమయంలో పీకే ఆ పార్టీలో చేరి అందులోని ఖాళీని భర్తీ చేయగలుగుతాడా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Prashant kishor, Punjab