కేంద్రంలో వచ్చేది సంకీర్ణమే... ఆప్లో చేరికపై ప్రకాశ్ రాజ్ క్లారిటీ
మే 23న ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని బెంగళూరు సెంట్రల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ప్రకాశ్ రాజ్ అన్నారు. న్యూస్18కి ప్రకాష్ రాజ్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. జాతీయ పార్టీల విధానానికి తాను పూర్తిగా వ్యతిరేకమని ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు. కేంద్రంలో వచ్చే కొత్త ప్రభుత్వం అయినా, కేంద్రం విధులు, రాష్ట్రాల విధుల మధ్య స్పష్టత తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ చేస్తున్న మంచిని చూసి ఆయనకు మద్దతుగా ప్రచారం చేయడానికి తాను ఢిల్లీ వచ్చానన్నారు. కేజ్రీవాల్ నిజమైన ప్రజాసమస్యల మీద పోరాడతారని, మతం, ఓట్ల రాజకీయాలు చేయబోరని ప్రకాశ్ రాజ్ అన్నారు. ఢిల్లీలోని కొన్ని మురికివాడల్లో తాను తిరిగానని, కొన్నిచోట్ల టాయిలెట్ల నిర్మాణం జరగలేదన్నారు. కేజ్రీవాల్ చేతులు కట్టేయడం వల్లే చేయలేకపోయారని ప్రకాశ్ రాజ్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీకి రాష్ట్రస్థాయి హోదా ఉండాలని ఆకాంక్షించారు. అందుకే కేజ్రీవాల్ పోరాడుతున్నారని చెప్పారు.
జాతీయ పార్టీల విధానం విఫలమైందని ప్రకాష్ రాజ్ అన్నారు. పాలసీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొందరికి అది నచ్చకపోయినా పార్టీ విప్కు కట్టుబడి ఓటు వేస్తున్నారని ప్రకాశ్ రాజ్ అన్నారు. ఒక సమస్య వచ్చినప్పుడు 543 మంది ప్రజాప్రతినిధులు కూర్చుని చర్చించి పరిష్కరించాలని ప్రకాశ్ రాజ్ అభిప్రాయపడ్డారు. అందుకే ఓ కన్హయ్య కుమార్ (బెగూసరై, సీపీఐ అభ్యర్థి), ఆతిషి (ఢిల్లీ ఆప్ అభ్యర్థి) లాంటి వారు గెలవాలని ఆకాంక్షించారు. ఆప్ కు మద్దతిస్తున్న ప్రకాశ్ రాజ్ ఆ పార్టీలో చేరతారంటూ వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. తాను కూడా పార్టీ పెట్టగలనని, అయితే, ఆప్కు మరికొంత గుర్తింపు తీసుకురావడమే తన ఉద్దేశం కానీ, తన గుర్తింపును పోగొట్టుకోవడం కాదని ప్రకాశ్ రాజ్ స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.