ఆంధ్రప్రదేశ్ రాజకీయం రంజుగా సాగుతోంది. ఓ పక్క చంద్రబాబే మళ్లీ సీఎం అవుతారా? లేక జగన్ ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకుంటారా? అని జోరుగా చర్చ సాగుతోంది. కొన్ని చోట్ల బెట్టింగులు కూడా నడుస్తున్నాయి. ఏపీ పాలిటిక్స్పై జాతీయ స్థాయిలోనూ చర్చలు జరుగుతున్నాయి. ఎన్నికల వేల పోలీసులను బదిలీ చేయడం, ఎల్వీ సుబ్రమణ్యాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించడం లాంటి సంఘటలను మరింత రక్తి కట్టించాయి. అయితే, తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందిన పీఆర్ మోహన్ సంచలనానికి తెరతీశారు. ఏకంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయిన ఎల్వీపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. శాప్ ఛైర్మన్గా తనకు ప్రభుత్వం నుంచి అందాల్సిన గౌరవ వేతనం, అలవెన్సులు అందకుండా ఎల్వీ అడ్డుపడుతున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. ‘శాప్ చైర్మన్గా 2015, జనవరి 28న ప్రభుత్వం నియమించింది. ఆ పదవికి తగ్గట్టు గౌరవ వేతనం, వసతి, ప్రయాణ సదుపాయాలతోపాటు సమావేశాలకు, కార్యకలాపాలకు హాజరైనందుకు తనకు ఖర్చులు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే అప్పటి క్రీడా విభాగం ముఖ్యకార్యదర్శిగా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆ బిల్లులను ఇవ్వలేదు’ అని ఆయన ఆ ఫిర్యాదులో కోరారు.
తన పదవీ కాలం 2017 జనవరి 28తో ముగిసిందని, ప్రస్తుతం సీఎస్గా ఉన్న ఎల్వీ ఇకనైనా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. తనకు ప్రయోజనాలు అందకుండా చేస్తున్నందుకు మోసం, దగా కేసులో ఎల్వీపై చర్యలు తీసుకోవాలని,తనకు అందే ప్రయోజనాలు అందేలా చూడాలని విజ్ఙప్తి చేశారు.