ఇవాళ రాజకీయంగా మరో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. జమ్ము కాశ్మీర్ భవిషత్యుత్తుపై నేడు క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జమ్ములోని వివిధ పార్టీల నేతలతో ప్రధాని మోడీ నేతృత్వంలో మీటింగ్ జరగనుంది. ఇందుకోసం అన్ని ప్రధాన పార్టీలను ప్రధాని మోదీ ఆహ్వానించారు. జమ్మూ కశ్మీర్ నుంచి కూడా పలు పార్టీలను ఆహ్వానించడంతో గురువారం సమావేశంపై ఆసక్తి నెలకొంది. జమ్మూ కశ్మీర్కు రాష్ట్రహోదా పునరుద్దరించాలనే అంశంపై చర్చ జరిగే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీ నేపథ్యంలో జమ్మూకశ్మీర్లో భద్రత కట్టుదిట్టం చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని నివాసంలో ఈ సమావేశం ప్రారంభమవుతుంది. కశ్మీర్కు చెందిన వివిధ పార్టీ నాయకులు 14 మందిని కేంద్రం ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఈ సమావేశానికి హాజరవడానికి ఒక్కొక్కరుగా నేతలు ఢిల్లీకి చేరుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన, ఎన్నికల నిర్వహణ వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశాలున్నాయి.
నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా బుధవారం పార్టీ నేతలతో ఈ సమావేశంపై చర్చించారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఇలాంటి సమావేశాలు జరగడం మంచిదేనని పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. కశ్మీర్ ప్రజల ఆకాంక్షలు తీర్చేలా ఈ ప్రాంత ఐక్యత, సమగ్రత కాపాడేలా చర్యలు తీసుకునే దిశగా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని సమావేశానంతరం నేషనల్ కాన్ఫరెన్స్ జమ్మూ ప్రాంత అధ్యక్షుడు దేవందర్ రాణా చెప్పారు. పీడీపీ చీఫ్ మెహబూబా కశ్మీర్కు తిరిగి స్వతంత్ర ప్రతిపత్తిని కట్టబెట్టాలని సమావేశంలో గట్టిగా డిమాండ్ చేస్తామని ఇప్పటికే స్పష్టం చేశారు. కశ్మీర్కి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా తిరిగి కట్టబెట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. కశ్మీర్ స్వయంప్రతిపత్తిని నిర్వీర్యం చేసే ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగే తొలి సమావేశం కావడంతో దీనిపై అందరికీ ఆసక్తి ఏర్పడింది.
ప్రధానితో కశ్మీర్ నేతల సమావేశం నేపథ్యంలో నియంత్రణ రేఖ వెంబడి భద్రతను కేంద్రం మరింతగా పెంచింది. 48 గంటలు హై అలర్ట్ ప్రకటించింది. సరిహద్దుల వెంబడి పాక్తో కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్నప్పటికీ కేంద్రం భద్రతను కట్టుదిట్టం చేసింది. కశ్మీర్ లోయలో ఇంటర్నెట్ను కూడా కట్ చేసే అవకాశాలున్నాయి.
: ప్రపంచంలో అత్యధిక విరాళాలు ఇచ్చేది ఎవరు.? బిల్ గేట్స్ మాత్రం కాదు..? ఇతర కుభేరుల స్థానమేంటి?
ఈ సమావేశం కోసం ఇప్పటికే జమ్మూ కశ్మీర్కు చెందిన నేతలంతా ఢిల్లీకి పయనమయ్యారు. జమ్మూకశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలన్న అంశంపై ఎన్నో వ్యూహాత్మకమైన చర్చలు జరిగాయి. జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక హోదా కొనసాగించాలని సమావేశంలో ఒత్తిడి తీసుకొస్తామని మెహబూబా ముఫ్తీ చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India news, Jammu and Kashmir, Modi, Politics