ప్రధాని నరేంద్ర మోదీ ఏం చేసినా డిఫరెంటే. ఆయనేం చేసినా హైలెట్టే. తాజాగా ఆయన చేసిన ఓ పనికి అలాంటి టాకే వినబడుతోంది. దేశం గర్వపడుతోంది. సఫాయి లేబర్లు (పారిశుధ్య కార్మికులు) దేశాన్ని శుభ్రం చేస్తే.. వాళ్ల కాళ్లకు అంటిన మలినాలను తాను శుభ్రం చేస్తానంటున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఉత్తర్ప్రదేశ్లో పర్యటించిన ప్రధానమంత్రి కుంభ్మేళాలో పాల్గొన్నారు. పవిత్ర గంగాస్నానం ఆచరించిన మోదీ.. గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి హారతినిచ్చారు. అనంతరం ఆయన పారిశుధ్య కార్మికులతో సమావేశమయ్యారు. వారి పాదాలను కడిగి, శుభ్రంగా తుడిచి.. శాలువాలను కప్పి సత్కరించారు. ప్రఖ్యాత కుంభ్ మేళా కార్యక్రమం విజయవంతం కావడానికి వారు చేసిన కృషిని కొనియాడారు. దేశాన్ని శుభ్రంగా ఉంచేందుకు వారు పడుతున్న తపన అభినందనీయమన్నారు.
ప్రయాగ్ రాజ్లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో కలిసి పాల్గొన్నారు. రైతులకు ఆర్థికసాయం అందించేందుకు కేంద్రం తలపెట్టిన ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకానికి శ్రీకారం చుట్టారు. దేశంలో 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు రూ. 2వేలు ఆర్థిక సాయాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన వివిధ ప్రాంతాల రైతులతో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.