ఎన్నికల రాజకీయాల్లో ప్రతి దాంట్లోనూ తన పేరు ఎందుకు లాగుతారంటూ ప్రియాంకా గాంధీ వాద్రా భర్త రాబర్ట్ వాద్రా ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన భారీ లేఖ రాశారు. తనను ఎన్నిసార్లు విచారించినా, నోటీసులు ఇచ్చినా తన మీద చేసిన ఒక్క ఆరోపణ కూడా రుజువు కాలేదని రాబర్ట్ వాద్రా అన్నారు. దేశంలో ఎన్నో సమస్యలు ఉండగా, వాటిని వదిలేసి కేవలం తనను మాత్రమే టార్గెట్ ఎందుకు చేస్తున్నారని రాబర్ట్ వాద్రా ప్రశ్నించారు.
‘మీ ఎన్నికల ర్యాలీలో మళ్లీ నాపేరు వినిపించడం నన్ను షాక్కి గురి చేసింది. దేశంలో పేదరికం, మహిళా సాధికారత, నిరుద్యోగం లాంటి చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నీ వదిలేసి మీరు నా గురించి మాట్లాడారు. గత ఐదేళ్లుగా మీ ప్రభుత్వం నన్ను వేధిస్తూనే ఉంది. కోర్టులు, ఐటీ, ఈడీ లాంటి ప్రభుత్వ సంస్థలు, ఇతర ఏజెన్సీల నుంచి వరుసగా నోటీసులు పంపి నన్ను మానసికంగా ఒత్తిడి చేయాలని చూశారు. ఇప్పటి వరకు 11 నోటీసులు పంపారు. ఈడీ లాంటి సంస్థలు నన్ను 8 గంటల నుంచి 11 గంటల పాటు నన్ను ప్రశ్నించారు. దేశంలోని వివిధ నగరాల్లో నా మీద విచారణ జరిపించారు. అయినా, ఒక్కదాంట్లో కూడా నా మీద ఆరోపణలను రుజువు చేయలేకపోయారు. పదే పదే నా మీద ఆరోపణలు చేయడం ద్వారా మీరు ఏం సాధించారో కానీ నాకైతే ఆశ్చర్యంగా ఉంది.’ అని రాబర్ట్ వాద్రా రాసిన లేఖలో ప్రశ్నించారు.
పరిపాలనలో విఫలమైన మోదీ ప్రభుత్వం.. ఎన్నికల్లో తన పేరు వాడుకోవడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందనే విషయం దేశం మొత్తానికీ తెలుసని రాబర్ట్ వాద్రా అన్నారు. ‘దయచేసి నా మీద వ్యక్తిగత దాడి ఆపండి. అలాంటి వ్యాఖ్యలు చేసి గౌరవ న్యాయవ్యవస్థను కించపరచొద్దు. నాకు భారతీయ న్యాయవ్యవస్థ మీద పూర్తి నమ్మకం ఉంది. నిజం గెలుస్తుంది. ఈ దేశ ప్రజలను ఆ దేవుడే కాపాడాలి.’ అని రాబర్ట్ వాద్రా రాసిన లేఖలో పేర్కొన్నారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాబర్ట్ వాద్రాను జైలుకు పంపిస్తామని ప్రధాని మోదీ అన్నారు. ఆ వ్యాఖ్యలకు రాబర్ట్ వాద్రా కౌంటర్గా లేఖ రాశారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.