
అసదుద్దీన్ ఒవైసీ, కేసీఆర్ (ఫైల్ ఫొటో)
నవంబరు 5 లోపు విధుల్లో చేరాలంటూ కార్మికులకు కేసీఆర్ పిలుపునిచ్చారని.. సీఎం మాటలు ఆలకించి అందరూ విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేశారు ఓవైసీ.
తెలంగాణ ఆర్టీసీపై సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. నవంబరు 5 లోపు విధుల్లో చేరాలంటూ కార్మికులకు కేసీఆర్ పిలుపునిచ్చారని.. సీఎం మాటలు ఆలకించి అందరూ విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేశారు ఓవైసీ. యూనియన్ నేతలు, విపక్షాల ఉచ్చులో పడి భవిష్యత్ను నాశనం చేసుకోవద్దని సూచించారు. ''కార్మికుల బాధను అర్థం చేసుకోగలను. కొంతమంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరం. తొందరపడి ప్రాణాలు తీసుకోకండి. సీఎం కేసీఆర్ మాటలను ఆలకించాలని కోరుతున్నా.'' అని ఆయన అన్నారు.
మరోవైపు సీఎం కేసీఆర్కు కీలక సూచనలు చేశారు ఓవైసీ. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలా? లేదా? అన్నది కేసీఆర్ ఇష్టమని అభిప్రాయపడ్డారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసినప్పటికీ బస్సుల నెంబర్ ప్లేట్స్లో ఉండే 'Z' అక్షరాన్ని మాత్రం తొలగించవద్దని కోరారు. నిజాం చివరి రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తల్లి జెహ్రా పేరు మీద ఆ అక్షరాన్ని పొందుపరిచారని గుర్తు చేశారు. ఆర్టీసీ నెంబర్ ప్లేట్లలోని Z అక్షరం.. హైదరాబాద్ చరిత్రలో ఒక భాగమని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ z అక్షరాన్ని తీసేయవద్దని కోరారు ఓవైసీ.
Published by:Shiva Kumar Addula
First published:November 03, 2019, 16:05 IST