మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవిత గాథ ఆధారంగా తెరకెక్కిస్తున్న వివాదాస్పద చిత్రం ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’కి కోర్టు చిక్కులు తప్పేలా లేదు. ఈ సినిమా ట్రైలర్ ప్రదర్శనపై నిషేధం విధించాలంటూ ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలయ్యింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రతిష్టను దిగజార్చేందుకు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని పిటిషనర్ అభ్యంతరం వ్యక్తంచేశారు. మాజీ పీఎంవో మీడియా సలహాదారుడు సంజయ బరు పుస్తకం (ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్) ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు చెబుతున్నా...ఈ పుస్తకంలోని అంశాలను వక్రీకరించారని పిటిషనర్ ఆరోపించారు. ఈ చిత్రం ట్రైలర్ను విడుదల చేయకుండా ఆదేశాలివ్వాలని ఢిల్లీ హైకోర్టును కోరారు.
ఈ చిత్రంలో మన్మోహన్ సింగ్ పాత్రను బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ పోషిస్తున్నారు. మన్మోహన్ సింగ్ను నెగటివ్ కోణంలో చూపించేందుకు ఈ చిత్రాన్ని బీజేపీ మద్దతుదారులు తెరకెక్కిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే కాంగ్రెస్ విమర్శలను అనుపమ్ ఖేర్ తిప్పికొడుతున్నారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కాంగ్రెస్ అడ్డుకుంటోందని అభ్యంతరం వ్యక్తంచేశారు. గతంలో ‘పద్మావత్’ చిత్రం వివాదం విషయంలో ఒకలా...ఇప్పుడు మరోలా కాంగ్రెస్ స్పందిస్తోందని ఆరోపించారు. ఈ చిత్రాన్ని విడుదలకు ముందు మన్మోహన్ సింగ్కు ప్రత్యేకంగా ప్రదర్శించేందుకు సిద్ధమని తెలిపారు.
ఈ చిత్రం ప్రదర్శనను అడ్డుకోవాలంటూ ఇప్పటికే దేశ వ్యాప్తంగానూ పలు కోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. మన్మోహన్ సింగ్ ప్రతిష్టను దిగజార్చేలా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని నిషేధించాలని పిటిషనర్లు కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.